విశ్రాంతి తీసుకుంటే బెటర్:
టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ మాట్లాడుతూ... జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లిష్ కౌంటీలు ఆడటం కంటే విశ్రాంతి తీసుకుంటేనే మంచిదని సలహా ఇచ్చాడు. ఇప్పటికే మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్న బుమ్రాకు ఇంగ్లిష్ కౌంటీ ఆడాల్సిన అవసరం ఏమాత్రం లేదని అభిప్రాయపడ్డాడు. 'బుమ్రా ప్రస్తుతం టీమిండియాలో టాప్ బౌలర్. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. ఇప్పటికే మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. మా కాలంలో పోలిస్తే.. ఇప్పుడు కౌంటీ క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో అతను విశ్రాంతి తీసుకుంటే ఉత్తమం' అని అక్రమ్ పేర్కొన్నాడు.
సుదీర్ఘ ఫార్మాట్ ద్వారానే క్రికెటర్ల ప్రతిభ గుర్తించగలం:
'నేను ఆరు నెలలు పాకిస్థాన్ తరఫున ఆడితే.. ఆరు నెలలు లంకషైర్ తరఫున ఆడేవాణ్ని. కానీ.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలా ఆడటం సాధ్యమయ్యే పని కాదు. టీ20 ఫార్మాట్ నుంచి బౌలర్లు నేర్చుకునేది ఏమీ ఉండదు. యువ క్రికెటర్లు టీ20 మ్యాచ్లు ఆడటం కంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటంపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. టీ20 ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్ల ప్రతిభను నేను ఎప్పుడూ జడ్జ్ చేయలేను. సుదీర్ఘ ఫార్మాట్ ద్వారానే క్రికెటర్ల ప్రతిభను గుర్తించగలను' అని అక్రమ్ అన్నాడు.
టాలెంట్ అనే ట్యాగ్ను ఎంజాయ్ చేసేవాడిని:
'నేను క్రికెట్ ఆడే తొలి రోజుల్లో నా టాలెంట్ను ఇమ్రాన్ భాయ్, మియాందాద్ భాయ్, ముదాసర్ నజార్లు మాత్రమే గుర్తించారు. ఈ కుర్రాడిలో టాలెంట్ ఉందని వారు పదే పదే చెబుతూ ఉండేవారు. అది నాకు అర్థం అయ్యేది కాదు' అని గత జ్క్షాపకాల్ని అక్రమ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ముగ్గురి నుండి వేరు వేరు విషయాలను నేర్చుకున్నానన్నాడు. అయితే తాను టాలెంట్ అనే ట్యాగ్ను ఎంజాయ్ చేసేవాడినని అక్రమ్ తెలిపాడు.
ఇంగ్లిష్ కౌంటీల వైపు మొగ్గు:
తమ ప్రతిభను మరింత మెరుగు పరుచుకోవడం కోసం చాలా మంది క్రికెటర్లు ఇంగ్లిష్ కౌంటీల వైపు మొగ్గు చూపుతుంటారు. ప్రపంచంలోని ఎంతటి స్టార్ క్రికెటర్లైనా ఇంగ్లిష్ కౌంటీలు ఆడటాన్ని హుందాగా స్వీకరిస్తారు. ఇలా ఇంగ్లిష్ కౌంటీలు ఆడిన ప్రధాన భారత క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, సౌరవ్ గంగూలీ, అజింక్యా రహానే, యువరాజ్ సింగ్, చతేశ్వర పుజారా తదితరులు ఉన్నారు.