ఆంధ్రతో జరిగిన మ్యాచ్తో కెరీర్ను ముగించి
ఇటీవల క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన గౌతం గంభీర్ రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్తో గంభీర్ తన కెరీర్ను ముగించాడు. ఆఖరి మ్యాచ్లో సెంచరీతో కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్.. 2012లో ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్లో ధోనీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మాత్రం
2015 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని తనను, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్లను తుది జట్టుకు ధోనీ ఎంపిక చేయలేనంటూ చెప్పేశాడు. అది అలా ఉంచితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మాత్రం సెహ్వాగ్, టెండూల్కర్లను ఓపెనింగ్కు పంపి.. తనను ఫస్ట్డౌన్లో పంపించాడని గుర్తుచేశాడు. ఇద్దరిని మాత్రమే తీసుకుంటానని చెప్పి ముగ్గురినీ మ్యాచ్ ఆడించడం మాట తప్పడమేనని గుర్తు చేశాడు.
కెప్టెన్గా ఏదైనా నిర్ణయం తీసుకుంటే
కెప్టెన్గా ఏదైనా నిర్ణయం తీసుకుంటే చివరి వరకు దానికి కట్టుబడి ఉండాలని, అలా కాకుండా మళ్లీ దాన్ని వెనక్కి తీసుకోవడం సబబు కాదని పేర్కొన్నాడు. అంతేకాకుండా 2015 ప్రపంచ కప్ జట్టును 2012లోనే ఎంపిక చేయడం తనను షాక్కు గురిచేసిందని ఎద్దేవా చేశాడు. ధోనీ తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 37 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చిందని గంభీర్ గుర్తుచేశాడు.
ధోనీ కెప్టెన్సీని హైజాక్ చేద్దామని
ఈ వ్యాఖ్యలతో ధోనీపై గంభీర్ విమర్శలు గుప్పించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ధోనీ అప్పుడే ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే 2013లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవగలిగేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. గంభీర్పై తమకు ఎంతో గౌరవముందని, దయచేసి ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయొద్దని సూచిస్తున్నారు. ‘నీ దగ్గర అంత గొప్ప ఆటే ఉంటే ఎందుకు నిరూపించుకోలేకపోయావు. ధోనీ కెప్టెన్సీని నువ్వు హైజాక్ చేద్దామని అనుకోలేదా' అంటూ మండిపడుతున్నారు.