సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడడం లక్ష్మణ్ ప్రత్యేకత
గంటల కొద్దీ సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడడం లక్ష్మణ్ ప్రత్యేకత. వరుసగా 15 టెస్టుల్లో విజయం సాధించి భారత పర్యటనకు ఆస్ట్రేలియా వచ్చింది. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ముంబైలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించింది. ఇక, కోల్కతా వేదిగగా జరిగిన రెండో టెస్టులో స్టీవ్ వా (110), మాథ్యూ హెడెన్ (97) రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే కుప్పకూలింది.
వన్డౌన్లో ద్రవిడ్కు బదులు లక్ష్మణ్
తొలి ఇన్నింగ్స్లో 274 పరుగుల భారీ ఆధిక్యం సాధించడంతో గంగూలీ నాయకత్వంలోని టీమిండియాను ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన కొద్దిసేపటికే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇంకా రెండు రోజులకు పైగా ఆట ఉంది. దీంతో మ్యాచ్ను నిలబెట్టుకోవాలంటే ఆసీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని వికెట్లను కాపాడుకోవాలి. ఇందుకు వీవీఎస్ లక్ష్మణే సరైన ఆటగాడు అని భావించిన జట్టు మేనేజ్మెంట్ ద్రవిడ్కు బదులుగా వన్డౌన్లో లక్ష్మణ్ను పంపించింది.
376 పరుగుల రికార్డు భాగస్వామ్యం
తొలి ఇన్నింగ్స్లో ఆఖరి వికెట్గా వెనుదిరిగినా లక్ష్మణ్ కనీసం కాళ్లకు ప్యాడ్ కూడా విప్పలేదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్కోరుబోర్డును నడిపించాడు. దాస్ (39), సచిన్ టెండూల్కర్ (10) తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరిన ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గంగూలీ (48)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ (180)తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
281 పరుగుల వద్ద మెక్గ్రాత్ బౌలింగ్లో ఔట్
ట్రిపుల్ సెంచరీకి దగ్గరైన తరుణంలో మెక్గ్రాత్ బౌలింగ్లో 281 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. ద్రవిడ్, లక్ష్మణ్లు అద్భుత ప్రదర్శనతో భారత్ రెండో ఇన్నింగ్స్ను 629/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం భారత్ బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 171 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ అప్పట్లో పెను సంచలనం. ఈడెన్ గార్డెన్స్లో లక్ష్మణ్ సాధించిన 281 పరుగుల ఇన్నింగ్స్ గత యాభై ఏళ్లలో నమోదైన అత్యుత్తమ టెస్టు ప్రదర్శనగా క్రికెట్ నిపుణులు ఎంపిక చేశారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్గా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్గా ఉన్నారు. 1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన లక్ష్మణ్ అనతి కాలంలోనే భారత్కు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు. భారత్ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 11వేలకు పైగా పరుగులు సాధించిన లక్ష్మణ్ అందులో 3,173 పరుగులు ఆస్ట్రేలియాపైనే సాధించాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలతో పాటు 17 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్రపంచకప్కు ప్రాతినిధ్యం వహించలేకపోయిన వీవీఎస్ లక్ష్మణ్
టెస్టు క్రికెట్లో భారత జట్టు రారాజుగా వెలుగొందిన వీవీఎస్ భారత్ తరఫున ప్రపంచకప్కు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు. విదేశీ గడ్డపై భారత్ను ఎన్నోసార్లు విజేతగా నిలిపాడు. 2008 పెర్త్ టెస్టు, 2009 నేపియర్ టెస్టుల్లో లక్ష్మణ్ ఇన్నింగ్స్ ఇప్పటికీ చిరస్మరణీయమే. 2012లో ఆడిలైడ్లో జరిగిన టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.