హైదరాబాద్: మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్పై హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. మైదానంలో కైఫ్ ఫీల్డింగ్ ఓ బెంచ్ మార్క్ అని కొనియాడాడు.
భారత జట్టులో తనతో ఆడిన ఆటగాళ్లలో నైపుణ్యాలు, వారి నుంచి ఏం నేర్చుకున్నానో వివరిస్తానని ట్వీట్ చేసిన లక్ష్మణ్.. ఇందులో భాగంగా ఇప్పటికే రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జవగళ్ శ్రీనాథ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, ఆశీష్ నెహ్రాల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఇక శుక్రవారం మహ్మద్ కైఫ్ గురించి మాట్లాడుతూ.. అతనెంతో మంది యువకులకు స్పూర్తిగా నిలిచాడని ట్వీట్ చేశాడు.
'భారత దేశవాళీ క్రికెట్ విధానంతో అట్టడుగు స్థాయి నుంచి దూసుకొచ్చిన ఆటగాడు మహ్మద్ కైఫ్. ఉత్తర ప్రదేశ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తన అద్వితీయమైన ఆటతో ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచాడు. మైదానంలో మెరికల్లా కదిలే అతని ఫీల్డింగ్ త్వరలోనే ఓ బెంచ్ మార్క్ అవుతుంది'అని లక్ష్మణ్ ప్రశంసించాడు.
A product of India’s robust grassroots structure, @MohammadKaif inspired an entire generation of players from Uttar Pradesh to shed their insecurities and play at the highest level. His electric fielding soon became the benchmark that thousands strived to emulate. pic.twitter.com/TwbZD7DB1x
— VVS Laxman (@VVSLaxman281) June 12, 2020
ఇక కైఫ్ అనగానే ప్రతీ అభిమానికి మైదానంలోని అతని ఫీల్డింగ్ విన్యాసాలే గుర్తుకు వస్తాయి. అంతలా అతని ఫీల్డింగ్ ఉండేది. సర్కిల్ లోపల అతను పట్టే క్యాచ్లు, కొట్టే రనౌట్లు, బంతిపై దూకుతూ పరుగులను అడ్డుకునే విధానం కళ్లకు కనువిందు చేసేది. 2000ల్లో యువరాజ్ సింగ్, కైఫ్ భారత క్రికెట్లో తమ అసాధారణ ఫీల్డింగ్తో ఆకట్టుకున్నారు.
నాట్వెస్ట్ సిరీస్-2002 ఫైనల్లో భారత్ విజయంలో మహ్మద్ కైఫ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాప్ ఆర్డర్ విఫలమైన ఓటమి దిశగా పయనించింది. అయితే యువ ఆటగాళ్లు మహ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) అద్భుతంగా ఆడి భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించారు.
ఒక్క బంతికే 17 పరుగులు.. పాక్పై సెహ్వాగ్ అరుదైన రికార్డు!