హైదరాబాద్: వీరేంద్ర సెహ్వాగ్... భారత్ తరుపున టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడంటే ఏ బౌలర్కైనా దడపుట్టాల్సిందే. అంతలా బ్యాట్ని ఝుళిపించి పరుగులు రాబడతాడు మరీ. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లు అయిన వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, సక్లయిన్ ముస్తాక్, లసిత్ మలింగలకు సైతం దడపుట్టించాడు.
అలాంటి సెహ్వాగ్ ఓ బౌలర్ వేసిన బంతులను ఎదుర్కోనేందుకు ఇబ్బంది పడ్డాడట. ఇంతకీ ఆ బౌలర్ ఎవరని అనుకుంటున్నారా? శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. తాజాగా ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో తనను భయపెట్టిన బౌలర్తో పాటు కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

'నేను ఎదుర్కొన్న బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ చాలా కఠినం. అతను వేసిన బంతిని షాట్ కొట్టేందుకు చాలా కష్టపడేవాడిని. ఒక్కోసారి ఎక్కడ అవుటైపోతానోనని భయం కూడా వేసేది. అంతేకాదు అతని ముఖ కవళికలు నన్ను ఒత్తిడికి గురిచేసేవి' అని సెహ్వాగ్ తెలిపాడు.
ముఖ్యంగా ముత్తయ్య మురళీధరన్ ముఖ కవళికలు నన్ను భయపెట్టేవి. అతను వేసే దూస్రాను ఆడేందుకు కష్టపడేవాడిని. అతను మినహా ఏ బౌలర్నైనా నేను సునాయాసంగానే ఎదుర్కొన్నా' అని సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరిస్లో సెహ్వాగ్ కామెంటేటర్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.