హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా బెంగుళూరులో ఓ యువతిపై ఇద్దరు యువకులు వేధింపులకు పాల్పడిన ఘటనపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. బెంగుళూరులో జరిగిన ఘటన తనను ఎంతగానో కలచివేసిందని చెప్పాడు. భారతదేశం ప్రతి ఒక్కరికీ సురక్షితమైన ప్రదేశం కావాలని కోహ్లీ ఆకాంక్షించాడు.
అయితే జరుగుతున్నది చూసి కూడా అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిన పిరికివారిని ఏమనాలి, ఈ దారుణానికి పాల్పడిన వారిని మనుషులని అనగలమా? అంటూ కోహ్లీ ఆవేశంతో మాట్లాడాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్గా ఉన్న కోహ్లీ 94 సెకన్ల నిడివి ఉన్న రెండో వీడియో క్లిప్పులను ట్విట్టర్లో పోస్టు చేశాడు.

'కేవలం పొట్టి దుస్తులు ధరించినంత మాత్రాన ఇలా ప్రవర్తించారని చెప్పడం దారుణం. ఆమె దుస్తులు ఆమె ఇష్టం. కలగజేసుకునే హక్కు ఇతరులకు లేదు. అధికారంలో ఉన్నవారు దాన్ని సమర్థించడం అంతకన్నా హేయం. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను' అని కోహ్లి చెప్పుకొచ్చాడు.
మన ఆలోచనాదృక్పథం మారాలని కోహ్లీ సూచించాడు. మన దేశంలోని మహిళల్ని వేరుగా చూడొద్దని, అందరం సమానం అనే భావన ఉన్నప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని అన్నాడు. బెంగుళూరు వేధింపుల ఘటనపై తన కోపాన్ని ప్రదర్శించిన మొట్టమొదటి సెలబ్రిటీ కోహ్లీ కావడం గమనార్హం. బెంగుళూరులోని కమ్మనహళ్లిలో జరిగిన వేధింపుల ఘటనపై పలువురు హీరోలు, రాజకీయ నాయకులు స్పందించిన సంగతి తెలిసిందే.