లండన్: మూడో విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఓ కానుక ఇచ్చాడు. అదేంటో తెలుసా షాంపైన్ బాటిల్. ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో కెప్టెన్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో 97, రెండో ఇన్నింగ్స్లో 103 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కింద ట్రోఫీతో పాటు నిర్వాహకులు కోహ్లీకి ఓ షాంఫైన్ బాటిల్ కూడా అందజేశారు. ఈ బాటిల్ను తీసుకున్న కోహ్లీ నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వెలుపల కూర్చుని ఉన్న కోచ్ రవిశాస్త్రి వద్దకు వెళ్లి అతడికి అందజేశాడు.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో కోహ్లీసేన ఓటమి పాలైనప్పుడు అటు కోహ్లీతో పాటు ఇటు రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. కోహ్లీ, శాస్త్రి అధికారాలకు బీసీసీఐ కత్తెర వేయనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఈ సమయంలో కెప్టెన్ కోహ్లీకి రవిశాస్త్రి అండగా నిలిచాడు. అందుకు గురుదక్షిణగా కోహ్లీ తాను అందుకున్న షాంఫైన్ బాటిల్ను కోచ్ రవిశాస్త్రికి అందజేశాడు. మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించి తర్వాత మైదానంలో సంబరాలు చేసుకుంటుందని అందరూ భావించారు.
కానీ, అందుకు భిన్నంగా భారత ఆటగాళ్లు యథావిధిగా ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయారు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఆగస్టు 30న సౌతాంప్టన్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ సిరిస్లో ఇప్పటివరకు మూడు టెస్టులు ముగిశాయి. భారత్ 1-2తో వెనుకంజలో ఉంది.