పృథ్వీ vs గిల్:
ఓపెనర్ పృథ్వీ షా వన్డే సిరీస్లో ఫర్వాలేదనిపించినా.. భారీ స్కోరు సాధించేలేకపోయాడు. దూకుడుగా ఆడుతూ అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. ఇక ఓ రనౌట్ కూడా అయ్యాడు. సన్నాహక మ్యాచ్లోనూ దూకుడుగా ఆడి వికెట్ ఇచ్చుకున్నాడు. మయాంక్ సన్నాహక మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. మరోవైపు 'భారత్-ఎ' మ్యాచ్లలో శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణించినా.. ప్రాక్టీస్ మ్యాచ్లో విఫలమయ్యాడు. దీంతో కివీస్తో జరగనున్న తొలి టెస్టులో మయాంక్కు జతగా ఆడేదెవరో అనే సందేహం ఉండగా.. కోహ్లీ తాజా ఇంటర్వ్యూలో ఓ స్పష్టత ఇచ్చాడు.
కోహ్లీ ఓటు ఎవరికంటే:
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'పృథ్వీ షాకి ఎంతో ప్రతిభ ఉంది. అతడు తన ఆటను అలానే కొనసాగించాలని అందరం ఆశిస్తున్నాం. తన ప్రదర్శనపై షా ఎప్పుడూ నిరాశ చెందడు. మయాంక్ ఆసీస్లో రాణించనట్లుగానే.. పృథ్వీ న్యూజిలాండ్లో రాణిస్తాడని నమ్ముతున్నా. భయం లేకుండా ఆడే చాలా మంది క్రికెటర్లు ఉండటం జట్టుకు మరింత ప్రేరణగా నిలుస్తుంది. పృథ్వీ, మయాంక్కు అనుభవం లేదని అంటున్నారు. మయాంక్ గత ఏడాదిలో ఎన్నో పరుగులు చేసాడు. అతడు టెస్టు క్రికెట్ను ఎంతో అర్థం చేసుకున్నాడు' అని అన్నాడు. కోహ్లీ మాటలను బట్టి చూస్తే మయాంక్కు జతగా షా ఆడనున్నాడు.
తుదిజట్టులో ఇషాంత్:
గాయం నుంచి కోలుకున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తుది జట్టులో ఉంటాడని కోహ్లీ పరోక్షంగా చెప్పాడు. 'గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేస్తున్నాడు. గతంలో మాదిరిగానే అతని బౌలింగ్ ఉంది. ఇంతకుముందు ఇషాంత్ ఎన్నోసార్లు న్యూజిలాండ్లో క్రికెట్ ఆడాడు. ఆ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇషాంత్ గాయం నుంచి కోలుకుని పేస్ అద్భుతంగా వేయడం ఎంతో సంతోషం. మాకు మంచి పేస్ విభాగం ఉంది' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ముగ్గురు పేసర్లు.. ఒక స్పిన్నర్:
'తొలి టెస్టు తుది జట్టులో ముగ్గురు పేసర్లతో పాటు ఒక స్పిన్నర్ ఉంటాడు. ప్రపంచ స్థాయి స్పిన్నర్ ఎలాంటి పిచ్పై అయినా సత్తాచాటగలడు. గత కివీస్ పర్యటనకు వచ్చిన బౌలింగ్ విభాగంతో పోలిస్తే ప్రస్తుతం మరింత పటిష్ఠంగా ఉంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే వికెట్ కీపర్లు వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్లలో తుది జట్టులో ఎవరికి అవకాశం వస్తుందనే దానిపై మాత్రం కోహ్లీ స్పందించలేదు.