సచిన్ను అధిగమించిన విరాట్ కోహ్లీ
అతి తక్కువ ఇన్నింగ్స్లలో (205) పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు సచిన్(259 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. బుధవారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ అజేయంగా 157 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడంతో భారత జట్టు 321 పరుగుల స్కోరును నమోదు చేసిన సంగతి తెలిసిందే.
టైగా ముగిసిన విశాఖ వన్డే
అయితే, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ బ్యాట్స్మెన్ను భారత బౌలర్లు కట్టడి చేయడంలో విఫలం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో టైగా ముగిసిన వన్డేల పరంగా చూస్తే అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
టైగా ముగిసిన మ్యాచ్ల్లో
వన్డేల్లో టైగా ముగిసిన మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్(158) తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు.
విశాఖ వన్డేలో కోహ్లీ 37వ సెంచరీ
తాజాగా విశాఖ వన్డేలో సెంచరీతో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరాడు. గతంలో ఈ స్టేడియంలో 118, 117, 99, 65 పరుగుల ఇన్నింగ్స్లతో మెరిసిన కోహ్లీ.. బుధవారం 157 నాటౌట్ పరుగులతో సత్తాచాటాడు. తాజా సెంచరీ కోహ్లీకి ఇది 37వ సెంచరీ కావడం విశేషం. ఈ సిరిస్లో ఇది రెండోది కావడం గమనార్హం. విశాఖ స్టేడియంలో ఐదు ఇన్నింగ్స్ల్లో మూడో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
5 వన్డేలాడిన కోహ్లీ 139 సగటుతో 556 పరుగులు
బంగ్లాదేశ్లోని మిర్పూర్లో కోహ్లీ 13 ఇన్నింగ్స్లో నాలుగు సెంచరీలు బాదిన కోహ్లీ ఆ తర్వాత విశాఖలోనే ఎక్కువ సెంచరీలు సాధించాడు. అంతేకాదు ఈ స్టేడియంలో మొత్తం 5 వన్డేలాడిన కోహ్లీ 139 సగటుతో 556 పరుగులు రాబట్టాడు. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.