నువ్వు చెప్తే చేయాలా?
భారత ఆటగాళ్ల ఫిట్నెస్ లెవెల్స్ పెంచిన ఈ కోచ్.. కొత్తగా టీమిండియాలో చేరినప్పుడు ఒక షాకింగ్ అనుభవం ఎదురైందట. టీమిండియా వెటరన్ ఆటగాడు వచ్చి నేరుగా.. 'అసలు నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి? నువ్వు చెప్పిన ఫిట్నెస్ ట్రైనింగ్ రెజిమెంట్ ఎందుకు ఫాలో అవ్వాలి?' అని అడిగేశాడట.
అలా అతను అడిగేయడంతో తను షాకైపోయానని శ్రీధర్ వెల్లడించాడు. తను రాసిన 'కోచింగ్ బియాండ్: మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీం' అనే పుస్తకంలో ఈ ఘటన గురించి శ్రీధర్ రాసుకొచ్చాడు.
అడిగింది ఎవరంటే?
ఇలా శ్రీధర్ను సూటిగా అడిగిన ఆటగాడు మరెవరో కాదు.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్వినే. దీని గురించి గుర్తుచేసుకున్న శ్రీధర్.. 'జాతీయ జట్టుతో చేరిన మొదటి వారంలోనే అశ్విన్తో జరిగిన సంభాషణ అది. అది నాకు అలా గుర్తుండిపోయింది. తను నాతో గొడవకు దిగలేదు. చాలా మామూలుగా తన మనసులోని ప్రశ్నను బయటపెట్టాడు' అని రాసుకొచ్చాడు.
ఆ కన్వర్జేషన్ తర్వాత తన ఆలోచనా విధానమే మారిపోయిందని శ్రీధర్ చెప్పాడు. 'మా ఇద్దరికీ అప్పటికే మంచి పరిచయం ఉంది. అతను అలా అడిగేసరికి అసలే నేనేం నేర్పించాలి? అసలు కోచింగ్ ఏంటి? అనే స్థాయికి నా ఆలోచనలు వెళ్లిపోయాయి' అని చెప్పుకొచ్చాడు.
అశ్విన్ అడిగిన ప్రశ్న..
'మీరేం అనుకోనంటే శ్రీధర్ సర్.. అసలు నేను మీరు చెప్పింది ఎందుకు వినాలి? 2011 నుంచి 2014 వరకు ట్రెవర్ పెన్నీ మా ఫీల్డింగ్ కోచ్గా ఉన్నాడు. ఇప్పుడు మీరొచ్చారు. మీరు మాతో ఒక రెండు, మూడేళ్లు ఉండి వెళ్లిపోతారు. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ టైం నా జీవితంలో చాలా కీలకం. కాబట్టి మీరు చెప్పేది నాకు ఉపయోగపడుతుందని నేను కన్విన్స్ అవ్వాలి.
మీరు చెప్పే పని నా ఆటకు సహాయపడాలి.. లేదంటే అసలు మీరు చెప్పేది నేను ఎందుకు వినాలి? ఎందుకు చేయాలి?' అని అశ్విన్ అడిగాడట. ఇది వినగానే ముందుగా షాకైనా.. ఆ ప్రశ్న వెనుక ఉన్న ఇంటెన్షన్ అర్థం అవడంతో తన కోచింగ్ విధానం మారిపోయిందని శ్రీధర్ పేర్కొన్నాడు.