ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని అలా వదిలేయవద్దని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. వరుణ్ బౌలింగ్ ప్రిపరేషన్ మెరుగ్గా ఉండేలా చూడాలని, వ్యూహాత్మక అడ్జస్ట్మెంట్స్, బౌలింగ్ వేరియేషన్స్లో చేయాల్సిన మార్పుల గురించి అతనితో ఎవరైనా మాట్లాడాలని అశ్విన్ కోరాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని ఘనంగా ప్రారంభించిన వరుణ్ చక్రవర్తీ.. సూపర్-8 దశ నుంచి ఇబ్బంది పడుతున్నాడు. అతని బలహీనతలను పసిగట్టిన బ్యాటర్లు తొలి ఓవర్లోనే ఎదురు దాడికి దిగడంతో వరుణ్ చక్రవర్తీ లయ తప్పుతున్నాడు. ఇంగ్లండ్తో సెమీఫైనల్లో వరుణ్ చక్రవర్తీ తొలి ఓవర్లోనే జాకోబ్ బెతెల్ వరుసగా మూడు సిక్స్లు బాదాడు. దాంతో వరుణ్ పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లలో ఒక వికెట్ తీసి 64 పరుగులిచ్చుకున్నాడు. తన కెరీర్లోనే ఇన్ని పరుగులివ్వడం ఇదే తొలిసారి.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వరుణ్ చక్రవర్తీ బౌలింగ్ గురించి మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్.. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించాడు. 'వరుణ్ చక్రవర్తిపై ప్రత్యర్థి జట్లు ఎదురు దాడికి దిగడం .. అతను వేసే బంతిని ముందుగానే పసిగడుతున్నాయి. వరుణ్ కేవలం బ్యాటర్లు తన మిస్టరీ బౌలింగ్ను గుర్తుపట్టలేరు అనే నమ్మకం మీద మాత్రమే ఆధారపడకూడదు. ఆదిల్ రషీద్ దగ్గర గూగ్లీ ఉందని అందరికీ తెలుసు. కానీ అతను విఫలం కాడు. ఎందుకంటే అతను వ్యూహాత్మకంగా ఉంటాడు. వరుణ్ తన లైన్ అండ్ లెంగ్త్ మార్చుకోవాలి. అలాగే బంతి వేగంలో వైవిధ్యం చూపడం చాలా ముఖ్యం. వరుణ్తో ఎవరైనా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది.

ప్రతిసారీ వరుణ్ అటాక్కు గురైనప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాడు. ఎందుకంటే తాను వెనుకబడిపోతున్నాననే విషయం అతని తెలుసు. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. మళ్లీ చెబుతున్నా.. ఎడమచేతి వాటం బ్యాటర్లకు రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేయవద్దు. అలా చేయడం వల్ల బ్యాటర్లకు బంతిని హిట్ చేయడం సులువు అవుతోంది. తొలి ఓవర్లోనే పరుగులివ్వడం వల్ల వరుణ్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. నేను కూడా గతంలో వేగంగా బంతులు వేసేవాడిని. కానీ అవసరమైనప్పుడు కొంచెం విరామం తీసుకునేవాడిని. వరుణ్ కూడా తన తదుపరి బంతిని వేసే ముందు తను ఏం వేయాలనుకుంటున్నాడో స్పష్టత తెచ్చుకోవాలి.
కఠినమైన పరిస్థితులకు అనుగుణంగా మారడం, స్పందించడం అత్యంత కఠినమైన పని. ప్రతీ రోజు బాగుండదు. చెడు రోజులు వస్తూనే ఉంటాయి. వరుణ్కు ఈ తడబడాటు కొత్త. కాబట్టి అతని చుట్టూ ఉన్నవారు ఎలాంటి సంభాషణలు జరుపుతారనేది కూడా కీలకం. ఇప్పటివరకు అందరూ తనను అంచనా వేయలేరని వరుణ్ నెట్టుకొచ్చాడు. కానీ ఇప్పుడు జట్లు అతన్ని నిశితంగా గమనిస్తున్నాయి. కాబట్టి, ఇకపై స్పిన్ బౌలింగ్లోని సూక్ష్మ అంశాలపై అతను దృష్టి పెట్టాలి. ఇది అతనికి ఒక పెద్ద సవాలు, నేర్చుకోవాల్సిన పాఠం.'అని అశ్విన్ పేర్కొన్నాడు.
వరుణ్ స్థానంలో కుల్దీప్ను ఆడించాలా? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. 'మేనేజ్మెంట్ దీని గురించి ఆలోచిస్తుంది. కానీ, వరుణ్ను ఫైనల్ మ్యాచ్లో తప్పిస్తారని నేను అనుకోవడం లేదు. ఆ మార్పు జరగకపోవడమే మంచిది.' అని అశ్విన్ అభిప్రాయపడ్డారు.