
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత క్రికెటర్ల నుంచి మాజీ క్రికెటర్ల వరకు తనదైన శైలిలో ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంటాడు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు టచ్లో ఉంటాడు.
తాజాగా సోమవారం ఆర్యభట్ట పుట్టినరోజుని పురస్కరించుకుని సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్టర్లో స్పందించాడు. ఎనిమిదేళ్ల క్రితం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన సెహ్వాగ్.. బర్మింగ్హామ్లో జరిగిన మూడో టెస్టులో తాను రెండు ఇన్నింగ్స్ల్లో డకౌటైన విషయాన్ని మరోసారి పేర్కొంటూ "నేను కింగ్ పెయిర్ స్కోరు" చేశానంటూ ట్వీట్ చేశాడు.
"సరిగ్గా ఇదే రోజు(ఆగస్టు 12వ తేదీన) నేను కింగ్ పెయిర్ స్కోరు చేశా. ఈ ఘనత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టకే దక్కుతుంది. మనం ఫెయిల్యూర్ కావడానికి జీరో చాన్స్ మాత్రమే ఉంటే ఇంకేమి చేస్తాం" అని సెహ్వాగ్ ఫన్నీగా ట్వీట్ చేశాడు. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్లో ఒక బ్యాట్స్మన్ డకౌట్గా పెవిలియన్ చేరితే కింగ్ పెయిర్గా పిలుస్తామనే సంగతి తెలిసిందే.
ఇప్పుడు దానిని గుర్తు చేసుకున్న సెహ్వాగ్.. తనపై తానే సెటైర్ వేసుకుని మరీ అభిమానుల్ని అలరించాడు. ఆ పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఆ సిరిస్ను 4-0తో కోల్పోయింది. మొదటి రెండు టెస్టులకు దూరమైన సెహ్వాగ్ ఆ తర్వాత జరిగిన మూడో టెస్టులో ఆడి రెండు ఇన్నింగ్స్ల్లో పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు.