
ఉత్తరప్రదేశ్: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. భారత్లోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటివరకు వైరస్ కేసుల సంఖ్య 6,820కి చేరుకోగా.. 229 మంది చనిపోయారు. అయితే వైరస్ కట్టడి కోసం ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. నిత్యావసరాలకి మినహా ఎవరూ ఇంటి వెలుపలికి రాకూడదని రూల్స్ పెట్టింది. అయితే లాక్డౌన్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్యానల్ అంపైర్ అనిల్ చౌదరి పడరాని పాట్లు పడుతున్నాడు.
భారత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడానికి ముందు ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలోని డాంగ్రోల్ అనే తన స్వగ్రామానికి అనిల్ చౌదరి వెళ్ళిపోయాడు. లాక్డౌన్ కారణంగా చౌదరి అక్కడే ఇరుక్కుపోయాడు. ఇద్దరు కొడుకులతో కలిసి డాంగ్రోల్ గ్రామంలో ఉన్న చౌదరి.. ఢిల్లీలో ఉన్న ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అక్కడ మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోవడంతో పోలాల వెంట తిరుగుతూ, చెట్లెక్కుతూ నెట్వర్క్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాన్ని అనిల్ చౌదరినే స్వయంగా వెల్లడించాడు.
'మార్చి 16 నుంచి ఇద్దరు కొడుకులతో కలిసి ఇక్కడే ఉన్నా. చాలా రోజులైంది కదా అని స్వగ్రామానికి వచ్చా. ఓ వారం పాటు ఇక్కడ ఉండాలనుకున్నా. లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అమ్మ, భార్య ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు. ఇదే అతి పెద్ద సమస్య. ఢిల్లీలో ఉన్నవారితో మాట్లాడాలంటే సిగ్నల్ అందడం లేదు. సిగ్నల్ కోసం ఊరి బయటకు కూడా వెళ్లా, చెట్లు ఎక్కి కూర్చున్నా' అని అనిల్ చౌదరి తెలిపాడు.
'అంపైర్ల కోసం ఐసీసీ ఆన్లైన్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తోంది. వాటిని యాక్సెస్ చేయడానికి నాకు ఇంటర్నెట్ అవసరం. నా కొడుకు హిందూ కాలేజీలో చదువుతున్నాడు, అతడికి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. కానీ మొబైల్ సిగ్నల్ లేకపోడంతో వాటికి హాజరు కాలేకపోతున్నాడు. గుంపులుగా ఉండకూడదని ఇక్కడి ప్రజలకు చెప్తున్నా. నిరంతరం చేతులను సబ్బుతో కడుక్కోవాలని సూచించా. కొన్ని మాస్కులు కూడా పంపిణీ చేశా' అని చౌదరి చెప్పాడు. అనిల్ చౌదరి 20 వన్డేలు, 27 టీ20లకు అంపైర్గా విధులు నిర్వర్తించాడు.