|
నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిన టాపార్డర్
292 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా టాపార్డర్ సైతం నిమిషాల వ్యవధిలో కుప్పకూలింది. ఇందులో గమనార్హంగా కోహ్లీ నాలుగు బంతులు ఆడి డకౌట్గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ ఏకంగా 300కు పైగా బంతులాడి 106పరుగులు చేసిన పూజారా సైతం సున్నా పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇలా మొదటి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే 5 కీలక వికెట్లను కాపాడుకోలేకపోయింది.
|
కమిన్స్ చేతికి 4, హేజిల్ వుడ్ 1
ఆస్ట్రేలియా బౌలర్ కమ్మిన్స్ పిచ్ అనుకూలిస్తున్న నేపథ్యంలో 32 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లను చేజిక్కుంచుకున్నాడు. అనూహ్యంగా నాలుగు వికెట్లూ కమ్మిన్స్ ఖాతాలోకే చేరాయి. కమ్మిన్స్ ధాటికి హనుమ విహారి (13), పుజారా (0), కోహ్లీ (0), రహానే (1) స్వల్ప స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత బరిలోకి దిగిన రోహిత్(5) హేజిల్ వుడ్ బౌలింగ్లో షాన్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
|
27 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 54
దీంతో భారత్ ప్రస్తుతం 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులుచేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (25 నాటౌట్), రిషబ్ పంత్(6) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో భారత్ ప్రస్తుతం 346 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
22 పరుగులే అత్యధిక స్కోరు
మెల్బౌర్న్ వేదికగా గురువారం మ్యాచ్లో బుమ్రా ఏ దశలోనూ ఆతిథ్య జట్టు బ్యాట్స్మెన్ను కోలుకోనివ్వలేదు. ఈ ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాట్స్మెన్లు సాధించిన పరుగుల్లో అత్యధికంగా 22 పరుగులకు మించి చేయలేదంటే టీమిండియా బౌలర్లు ఏస్థాయిలో విరుచుకు పడ్డారో అర్థమవుతోంది. ఈ ఇన్నింగ్స్లో బుమ్రా ఆరు వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. జడేజా రెండు వికెట్లు, ఇషాంత్, షమీ చెరొక వికెట్ తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసేలా చేశారు.