హైదరాబాద్: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుని ముందుండి నడిపించిన తీరు తనని ఎంతగానో ఆకట్టుకుందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వెల్లడించాడు.
బర్మింగ్హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో టాపార్డర్ బ్యాట్స్మెన్ విఫలమైనప్పటికీ, కోహ్లీ క్రీజులో నిలదొక్కుకుని రెండు ఇన్నింగ్స్ల్లో 200 పరుగులు(149, 51) చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లు రాణించడంతో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మంగళవారం తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న 'రన్ ఆడం' అనే యాప్ని విడుదల చేసిన ధోని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ గురించి మహేంద్రసింగ్ ధోనీ మీడియాతో మాట్లాడాడు.
"కోహ్లీ బెస్ట్ బ్యాట్స్మెన్. అతను ఇప్పటికే అత్యున్నత స్థాయిని అందుకుని.. దిగ్గజ క్రికెటర్ హోదాకి సమీపంలో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా విదేశీ గడ్డలపైనా కోహ్లి రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి టెస్టులో జట్టుని ముందుండి నడిపించాడు. కెప్టెన్ నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శననే ఆశిస్తుంది" అని ధోని పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్తో తొలి టెస్టులో పరాజయం పాలైన భారత్.. సిరీస్ గెలవగలదా? అని ధోనిని అడిగితే.. ''ఒక టెస్టు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీయడం చాలా కీలకం. భారత బౌలర్లు అది చేయగలిగారు. ఇదే నా జవాబు. బ్యాటింగ్ ఎంత బాగా చేసినా 20 వికెట్లు తీస్తేనే గెలవగలం'' అన్నాడు.
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్తో క్రికెట్ అభిమానుల మనసులు గెలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులు చేసిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్లో 51 పరుగులతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ క్రీజులో ఉన్నంత వరకు భారత అభిమానులు గెలుపు మనదేనని ధీమాతో ఉన్నారు.
అయితే, బెన్ స్టోక్స్ బౌలింగ్లో వికెట్ల ముందు అతడికే నేరుగా క్యాచ్ ఇవ్వడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మళ్లింది. కాగా, గత కొన్నేళ్లుగా విదేశాల్లో విరాట్ కోహ్లీ మెరుగ్గా ఆడుతున్నాడు. విదేశీ పిచ్ల మీద మిగతా ఆటగాళ్లు విఫలం అవుతున్నా.. కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.
Watch: @msdhoni reveals his formula of winning a Test match #TestCricket #ENGvIND @BCCI @englandcricket pic.twitter.com/DjKy9QtLxU
— myKhel.com (@mykhelcom) August 7, 2018
ఇదిలా ఉంటే, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది.
మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది. లార్డ్స్లో టెస్టు మ్యాచ్ అంటే ప్రతి జట్టుకు ఎంతో ప్రత్యేకం. టీమిండియా సారథ్య బాధ్యతలు వహించిన ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో విజయాలను సాధించారు.
భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో మాత్రమే భారత్ ఇప్పటి వరకు లార్డ్స్లో విజయాలు నమోదు చేసుకుంది. ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. దీంతో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ విజయాన్ని అందుకుంటాడా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కెప్టెన్గా కోహ్లీ ఈ మైదానంలో విజయం సాధించి కపిల్దేవ్, ధోనీ సరసన నిలుస్తాడో లేదో చూడాలి. కాగా, ఈ సిరిస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రెండో టెస్టులో విజయం సాధించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాడ్ రెండో టెస్టులోనూ గెలిచి 2-0ఆధిక్యాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.