టీమిండియా స్పిన్ ఎటాక్
భారత్లో టెస్టు సిరీస్ అంటేనే స్పిన్ను ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు సిద్ధం అవ్వాలి. మరి ఆస్ట్రేలియా బ్యాటర్లు టీమిండియా వద్ద ఉన్న క్వాలిటీ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అదే ఆస్ట్రేలియా విజయావకాశాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితర కీలక బ్యాటర్లంతా రవిచంద్రన్ అశ్విన్, జడేజాను సమర్ధవంతంగా ఎదుర్కొంటే ఆ జట్టు సిరీస్ గెలిచే అవకాశాలు చాలా మెరుగవుతాయి.
ఆస్ట్రేలియా బౌలింగ్
ఈ సిరీస్లో భారత స్పిన్నర్లు బాగా ప్రభావం చూపుతారనే విషయం వేరే చెప్పక్కర్లేదు. అయితే ఆసీస్ బౌలర్లు కూడా తక్కువేం కాదు. కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాల్గా మారనుంది. ఇటీవల పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లో వీళ్లిద్దరూ అద్భుతంగా రాణించారు. పిచ్ ఎలా ఉన్నా మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేయడం కమిన్స్ స్పెషాల్టీ. పాకిస్తాన్ సిరీస్లో కమిన్స్, లియాన్ ఇద్దరూ చెరో 12 వికెట్లతో ఆ జట్టును గెలిపించారు. దీంతో భారత పిచ్లపై కూడా ఆసీస్ బౌలర్లు రాణిస్తే టీమిండియాకు కష్టాలు తప్పవు.
రిషభ్ పంత్ లేని లోటు
ఇటీవలి కాలంలో టీమిండియా గెలిచిన టెస్టు మ్యాచుల్లో ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్లు ఆడిన ఆటగాడు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. అయితే రోడ్డు ప్రమాదం కారణంగా అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతను లేని లోటు భారత మిడిలార్డర్పై తీవ్రంగా ప్రభావం చూపనుంది. దీన్ని కనుక టీమిండియా పూడ్చుకోగలిగితే.. అంటే మిడిలార్డర్లో కేఎస్ భరత్ లేదా ఇషాన్ కిషన్ ఎవరికి అవకాశం లభిస్తే వాళ్లు ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడితే భారత్ విజయావకాశాలు చాలా పెరుగుతాయి. అదే సమయంలో పంత్ లేని లోటును ఆస్ట్రేలియా జట్టు క్యాష్ చేసుకుంటే ఆ టీం కూడా సిరీస్ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుంది.