
హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో జరుగుతున్న చారిత్రాత్మక టెస్టులో టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరుపున టెస్టు క్రికెట్లో 100 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
ఆప్ఘన్ బ్యాట్స్మన్ రహ్మాత్ షా(14) పరుగుల వద్ద ఎల్బీగా పెవిలియన్కు చేర్చడంతో ఉమేశ్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్ల క్లబ్లో చేరిన సందర్భంగా ఉమేశ్ యాదవ్కు జట్టులోని సహచర క్రికెటర్లు అభినందనలు తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.ఇప్పటి వరకు టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. కపిల్దేవ్ (434 వికెట్లు), జహీర్ ఖాన్ (311), జవగళ్ శ్రీనాథ్ (236), ఇషాంత్ శర్మ (234), మహ్మద్ షమీ (110) ఉన్నారు.
ఫిరోజ్ షా కోట్ల వేదికగా వెస్టిండీస్తో 2011, నవంబరులో జరిగిన టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ ఇప్పటి వరకు 37 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో అతని అత్యుత్తమ ప్రదర్శన 93/5.
భారత వన్డే, టీ20 జట్టులో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లు మెరుగ్గా రాణిస్తుండటంతో.. గత రెండేళ్లుగా ఎక్కువగా టెస్టులకే పరిమితమైన ఉమేశ్ యాదవ్ సుదీర్ఘ స్పెల్స్తో ఆకట్టుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే భారత్తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డ్రింగ్స్ విరామానికి 12.3 ఓవర్లకు గాను ఆప్ఘనిస్థాన్ 50/5 పరుగులు చేసింది.
అంతకముందు ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌటైంది. తొలిరోజు ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ సెంచరీలు సాధించగా.. లోకేష్ రాహుల్(54) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 347/6 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది.
రెండో రోజు ఆటలో ఓవర్నైట్ ఆటగాడు అశ్విన్(18) పరుగుల వద్ద పెవిలియన్కు చేరగా, మరో ఓవర్నైట్ ఆటగాడు హార్దిక్ పాండ్యాతో కలిసి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా టెస్టుల్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 83 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఆ తర్వాత కాసపేటికే రవీంద్ర జడేజా(20) ఔట్ కావడంతో 436 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ను నష్టపోయింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో హార్దిక్ పాండ్యా(71) సైతం పెవిలియన్ చేరాడు. చివర్లో ఉమేశ్ యాదవ్(26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది.