INDvsSL : సచిన్ దాటిన కోహ్లీ.. అతన్ని దాటిన గిల్.. మూడో వన్డేలో రికార్డుల పంట!

తొలి రెండు వన్డేల్లో సూపర్ పెర్ఫామెన్స్తో ఘనవిజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో కూడా శ్రీలంకను చిత్తుచేసింది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి శ్రీలంకను చిత్తు చేసింది.
ఈ క్రమంలో భారత జట్టు పలు రికార్డులు కూడా బద్దలు కొట్టింది. అవేంటో ఒకసారి పరిశీలిస్తే..

టీమిండియా ఫ్యూచర్
ప్రస్తుతం వన్డే క్రికెట్లో భారత భవిష్యత్తు ఎవరు? అంటే చటుక్కున చెప్తున్న పేరు శుభ్మన్ గిల్. గత ఏడాది కాలంగా వన్డే ఫార్మాట్లో చాలా నిలకడగా రాణిస్తూ.. వెటరన్ శిఖర్ ధవన్ను వెనక్కు నెట్టి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడీ యువ ఓపెనర్. తనకు దక్కిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు కూడా. గతేడాది వెస్టిండీస్పై తన తొలి వన్డే శతకం నమోదు చేసిన అతను.. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కూడా శతక్కొట్టాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు తన పేరిట రాసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలి 20 ఇన్నింగ్స్ల తర్వతా అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతానికి 18 వన్డే ఇన్నింగ్సులు ఆడిన గిల్ దాదాపు 60 సగటుతో 894 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అతను 20 ఇన్నింగ్స్లలో 845 పరుగులు చేశాడు.

కోహ్లీ రికార్డుల మోత..
మూడో వన్డేలో అద్భుతమైన శతకంతో రాణించిన విరాట్ కోహ్లీ ఈ క్రమంలో పలు రికార్డులు తిరగరాశాడు. తన కెరీర్లో 46వ వన్డే శతకం నమోదు చేసిన కోహ్లీ.. గ్రీన్ఫీల్డ్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు అతను చేసిన 46 అంతర్జాతీయ వన్డే శతకాల్లో 21 సెంచరీలు భారత్లో చేసినవే కావడం గమనార్హం. ఇలా ఒక దేశంలో అది స్వదేశమే అయినా, విదేశమే అయినా సరే.. ఒక పర్టిక్యులర్ దేశంలో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ భారతదేశంలో 20 సెంచరీలు చేశాడు. కోహ్లీ ఇప్పుడు ఈ రికార్డును కూడా దాటేశాడు.

భారత్ భారీ విజయం
వ్యక్తిగత రికార్డుల కాదు.. మూడో వన్డేలో భారత జట్టు కూడా ఒక భారీ రికార్డు బద్దలు కొట్టింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. బ్యాటర్లు రాణించడంతో ఏకంగా 390 పరుగులు చేసిన భారత్.. లంకేయులను బంతితో కూడా ముప్పుతిప్పలు పెట్టింది. సిరాజ్, షమీ, కుల్దీప్ సత్తా చాటడంతో శ్రీలంకను 73 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో ఏకంగా 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇంత భారీ విజయం మరే జట్టూ సాధించలేదు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిల్యాండ్ పేరిట ఉండేది. ఆ జట్టు 2008లో ఐర్లాండ్ను 290 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు భారత్ ఈ రికార్డును బద్దలు కొట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications