ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ను ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మన్ సూర్య కుమార్ యాదవ్ చితక్కొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్లో సూపర్ బ్యాటింగ్తో చెలరేగిన సూర్య.. ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. క్లిష్ట సమయాల్లో తనదైన బ్యాటింగ్తో ఆకట్టుకొని ఇండియన్ ఏబీడీగా ప్రశంసలు అందుకున్నాడు. గత రెండు, మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నా సూర్యకు టీమిండియా పిలుపు మాత్రం రాలేదు. దేశవాళీలో రాణించినా.. ఐపీఎల్లో మెరిసినా.. సూర్య ఆస్ట్రేలియా టూర్కు ఎంపికవ్వలేదు. దీనిపై కొంత అసంతృప్తికి గురైన ఈ ముంబైకర్.. తనదైన బ్యాటింగ్తో సెలెక్టర్లకు సవాల్ విసిరాడు.
యువ హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ హాట్ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్గా గ్యాలరీ
ప్రస్తుతం దేశవాళీ టీ20లీగ్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం సమాయత్తం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ప్రాక్టీస్ శిబిరంలో జరిగిన మ్యాచ్లో సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ను చీల్చిచెండాడాడు. ముంబై టీమ్ బీ, డీగా విడిపోగా.. బీని సూర్య లీడ్ చేయగా.. డీని యశస్వి జైస్వాల్ నడిపించాడు. నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చిన సూర్య 47 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 9 సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ వీరవిహారం చేశాడు. అర్జున్ టెండూల్కర్ వేసిన 13వ ఓవర్లో 21 పరుగులను పిండుకున్నాడు. ఇక ఈ ఒక్క ఓవర్ మినహా అర్జున్(1/31) మిగతా మూడు ఓవర్లను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. డెత్ ఓవర్లో ఓ వికెట్ కూడా తీసాడు. సూర్య విధ్వంసంతో టీమ్ బి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది.
కరోనాతో వచ్చిన సుదీర్ఘ విరామం అనంతరం వచ్చే ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో భారత దేశవాళీ క్రికెట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా జట్లన్నీ ఈ టీ20 లీగ్ కోసం సమాయత్తం అవుతున్నాయి.