|
కడుపు నొప్పితో..
మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్తో సరదాగా మాట్లాడిన సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ చిట్చాట్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు పంచ్లు పేల్చుకుంటూ నవ్వులు పూయించారు. టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకోవడం సంతోషంగా ఉందని, ఇది తన తొలి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అని పేర్కొన్నాడు.
ఇక ఉదయం సూర్యకు అస్వస్థతగా ఉందని ఫిజియోల ద్వారా తనకు తెలిసిందని, అసలేం జరిగిందని అక్షర్ పటేల్ ప్రశ్నించాడు. 'వాతావరణ మార్పులు, ట్రావెలింగ్ పడక ఉదయాన్నే కడుపు నొప్పి మొదలైంది. ఆ తర్వాత జ్వరం పట్టింది. అయితే సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో తప్పక ఆడాలని అనుకున్నా. అందుకే నా డాక్టర్కి, ఫిజియోకి ఈ విషయం చెప్పాను. మీరు ఏం చేస్తారో తెలీదు, ఈ రోజు మ్యాచ్ నేను ఆడాలని చెప్పా.
ఏం డోస్ ఇచ్చారు భయ్యా..
ఇదే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే ఆడకుండా తప్పించుకోలేను కదా... అందుకే ఆడాలనే పట్టుబట్టా. మందులు ఇస్తారా? ఇంజక్షన్ ఇస్తారా... మ్యాచ్ సమయానికి ఫిట్గా ఉండాలని చెప్పా. ఇక జెర్సీ వేసుకొని మైదానంలోకి దిగగానే వెయ్యి రెట్ల బలం వచ్చింది'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. దీనికి అక్షర్ నవ్వుతూ 'నీకు ఏం డోస్ ఇచ్చారో? ఏం కానీ భయ్యా.. నువ్వు దుమ్మురేపావు. ఇలానే డోస్ తీసుకుంటూ దంచికొట్టూ'అని చమత్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
సూర్య ఖాతాలో అరుదైన రికార్డు..
టీ20ల్లో ఈ ఏడాది 682 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ 2022 క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. 2018లో 689 పరుగులు చేసిన శిఖర్ ధావన్ రికార్డుకి 7 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటిదాకా 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, హైదరాబాద్ మ్యాచ్లో 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలిచాడు.
సూర్యకి ఇది టీ20ల్లో ఆరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. అతి తక్కువ మ్యాచుల్లో 6 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన భారత ప్లేయర్గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. యువరాజ్ సింగ్ 33, విరాట్ కోహ్లీ 35 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించి... సూర్య భాయ్ తర్వాతి ప్లేస్లో ఉన్నారు.
చెలరేగిన సూర్య, కోహ్లీ
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), టీమ్ డేవిడ్(27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిర్సర్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. డానియల్ సామ్స్(28 నాటౌట్) కీలక పరుగులు చేశారు. అనంతరం సూర్య, కోహ్లీ(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63) పాటు చివర్లో హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25 నాటౌట్) సత్తా చాటడంతో టీమిండియా 19.5 ఓవర్లలో 187/4 స్కోర్ చేసి విజయాన్నందుకుంది.