రైనా మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో రైనా మాట్లాడుతూ "భారత జట్టులో నేను No. 4లో ఆడగలను. గతంలో ఈ స్థానంలో ఆడిన అనుభవం నాకుంది. త్వరలో రాబోయే రెండు టీ20 వరల్డ్ కప్ల్లో నాకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నా" అని సురేశ్ రైనా తెలిపాడు. గత రెండు సంవత్సరాలుగా No.4 స్పాట్లో ఆడే బ్యాట్స్మెన్ కోసం జట్టు మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేసింది.
రాయుడు, శంకర్ విఫలం
ఈ స్థానంలో అంబటి రాయుడు, విజయ్ శంకర్, రిషభ్ పంత్లను ఆడించినప్పటికీ వారు విఫలమయ్యారు. వన్డే వరల్డ్కప్కు ముందు అంబటి రాయుడిని ఆడించగా... వరల్డ్ కప్ సమయంలో ఆ స్థానానికి విజయ్ శంకర్ను ఎంపిక చేశారు. అయితే, టోర్నీ మధ్యలోనే విజయ్ శంకర్ గాయపడటంతో ఈ స్థానానికి రిషబ్ పంత్ను ఎంపిక చేశారు.
No.4 స్పాట్పై చర్చ
ఇలా టీమిండియాలో No.4 స్పాట్పై చర్చ నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ స్థానంలో రిషబ్ పంత్. శ్రేయాస్ అయ్యర్లను మార్చి మార్చి పంపుతోన్న సంగతి తెలిసిందే. పంత్ ఈ స్థానానికి సరైన న్యాయం చేయలేకపోతుండటంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తనకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని రైనా అంటున్నాడు.
భారత విజయాల్లో కీలకపాత్ర
టీమిండియా తరుపున వన్డేల్లో 5,615 పరుగులు చేసిన రైనా, అంతర్జాతీయ టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు. గతంలో మిడిలార్డర్లో భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత తన సహజ సిద్ధమైన ఆటను ఆడటంలో విఫలమై జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత తిరిగి ఆటపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రైనాను గాయాలు వేధిస్తున్నాయి.