|
గ్రేసియాతో గల్లీ క్రికెట్:
కరోనా సెలవులను సురేశ్ రైనా తన కూతురు గ్రేసియా రైనాతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లోనే గ్రేసియా, మరో చిన్నబ్బాయితో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ రైనా సరదాగా గడుపుతున్నాడు. మొదటగా రైనా బౌలింగ్ చేయగా.. చిన్నబ్బాయి బ్యాటింగ్ చేసాడు. ఆపై రైనా బ్యాటింగ్ చేస్తుండగా.. గ్రేసియా ఔట్ ఔట్ అంటూ అరిచింది. అదిచూసి ఇంట్లోని వారు నవ్వుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో సోమవారం పోస్ట్ చేసింది. అచ్చమైన గల్లీ క్రికెట్ ఆడుతున్నారంటూ పేర్కొంది.
రూ. 52 లక్షల విరాళం:
కరోనాపై జరుగుతున్న పోరులో సురేశ్ రైనా తన వంతు సాయంగా రూ. 52 లక్షల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తం విరాళంలో రూ. 31 లక్షలు ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్ (పీఎం కేర్స్ ఫండ్)కు, రూ. 21 లక్షలు ఉత్తరప్రదేశ్ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ప్రతి ఒక్కరు తమ శక్తిమేర సాయం చేయాలని కూడా కోరాడు. అందరూ ఇంట్లోనే ఉండాలని కోరుతూ ఓ ట్వీట్ చేశాడు.
రైనా ఆశలకు కరోనా గండి:
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.
ఏడాది జూలైలో చివరి వన్డే:
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్లో తరచుగా మ్యాచ్లు ఆడుతున్న రైనా.. ఐపీఎల్-12 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. ఆపై గాయం కారణంగా ఆటకు చాలా నెలలు దూరమయ్యాడు. సురేశ్ రైనా, అతని భార్య ప్రియాంక రైనా ఇటీవలే రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. ప్రియాంక రైనా పండంటి మగ బిడ్డకు జన్మిచ్చారు.