హైదరాబాద్: 'ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న 2019 వరల్డ్ కప్లో నేను ఆడుతున్నాను. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా లేదా పాకిస్థాన్తో భారత్ తలపడుతోంది. విన్నింగ్ షాట్ కొట్టాను. అది ఫోర్. స్టాండ్స్లో ఉన్న నా కుమార్తె నన్ను చూసి చప్పట్లు కొడుతోంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ప్రతి ఒక్కరూ నన్ను అభినందిస్తున్నారు. ఇదే నాకు కావాల్సింది. ఇదే నా కల' అని సురేశ్ రైనా పేర్కొన్నాడు.
శ్రీలంకతో ఆగస్టు 20 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరిస్కు బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించిన జట్టులో సురేశ్ రైనా చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. అయితే యో-యో టెస్టులో ఫెయిల్ అయిన కారణంగా అతడు వన్డే సిరిస్లో చోటు దక్కించుకోలేకపోయాడు.
శ్రీలంకతో వన్డే సిరిస్లో చోటు లభించకపోయినప్పటికీ 2019 వరల్డ్ కపే తన లక్ష్యమని గురువారం సురేశ్ రైనా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు. 'ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న 2019 వరల్డ్ కప్లో నేను ఆడాలి. అదీ ఫైనల్లో. అందులోనూ ఆస్ట్రేలియా లేదా పాకిస్థాన్తో మ్యాచ్. ఆ మ్యాచ్లో నేను విన్నింగ్ షాట్ కొట్టాలి. అది కూడా ఫోర్ రూపంలో. స్టాండ్స్లో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న నా కుమార్తె గ్రేసియా చప్పట్లు కొడుతూ కనిపించాలి. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఉండాలి. ప్రతి ఒక్కరూ నన్ను ఛీర్ చేస్తూ ఉండాలి. ఇదే నాకు కావాలి. ఇదే నా కల కూడా' అని సురేశ్ రైనా చెప్పాడు.
'మనీ గురించి ఫేమ్ గురించి ఆస్సలు ఆలోచించడం లేదు. ఇప్పటికీ నేను వాటిని పొందాను. ఇదే విషయం నా భార్యకు ఎప్పుడో చెప్పాను. నా కూతురుని నేను అమితంగా ప్రేమిస్తున్నాను.. అలానే దేశం కోసం ఆడటాన్ని కూడా అంతే ఇష్టపడతాను. మరో నాలుగైదేళ్ల పాటు నేను క్రికెట్లో కొనసాగుతా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా భార్య ఎంతో మద్దతు తెలుపుతోంది' అని రైనా తెలిపాడు.
కాగా, 2011 వరల్డ్ కప్ క్యాంపెయిన్లో సురేశ్ రైనా కీలకపాత్ర పోషించాడు. అయితే గత రెండేళ్లుగా నిలకడలేమితో జట్టులో స్ధానాన్ని దక్కించుకోలేకపోతున్నాడు. చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్లో కనిపించిన రైనా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు.
దీంతో అతడి స్ధానంలో యువ క్రికెటర్లకు సెలక్టర్లు చోటు కల్పించారు. ఇక తాజాగా, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యో-యో టెస్టులో రైనాతో పాటు యువరాజ్ సింగ్ కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో వీరిద్దరూ లంక పర్యటనలో చోటు దక్కించుకోలేకపోయారు.