
భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ స్టార్ సురేశ్ రైనా తన సూపర్ ఫ్యాన్ విఘ్నేష్ ఇటీవల మరణించాడని తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. విఘ్నేష్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నాలుగుసార్లు ఛాంపియన్ అయన సీఎస్కే విజయాల్లో రైనా పోషించిన పాత్రేంటో మనందరికీ తెలిసిందే. రైనా ఆడుతున్న ప్రతిసారి విఘ్నేష్ స్టాండ్స్లో నిల్చొని ఎంతో ఉత్సాహపరిచేవాడు. అతను తన ఒంటిపై పసుపు కలర్ పూసుకుని ఛాతిపై, వీపుపై రైనా పేరును రాసుకుని తన అభిమానాన్ని చాటుకునేవాడు. అతను రైనా పట్ల చూపించే అభిమానం అంతా ఇంతా కాదు.
అతని మరణవార్త తెలిసి 'RIP బ్రదర్ @CricVignesh! మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని రైనా ట్వీట్ చేశాడు. అలాగే ఐపీఎల్ ఆడుతున్న రోజుల్లో రైనా ఫీల్డింగ్లో ఓ రనౌట్ చేయగా.. దానికి స్టేడియంలో విఘ్నేష్ సెలబ్రేషన్ జరుపుకుంటున్న వీడియోను కూడా రైనా ట్వీట్ చేశాడు. గత కొన్ని నెలలుగా పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న విఘ్నేష్ ఇటీవలే మృతి చెందాడు. ఈ విషయమై విజిల్ పోడు ఆర్మీ చేసిన ట్వీట్ను రైనా చదివి స్పందించాడు. 'ఇది చాలా షాకింగ్ న్యూస్. విఘ్నేష్ మరణవార్త నన్ను కలచివేసింది. అతను ఎప్పటికీ సూపర్ అభిమాని. విఘ్నేష్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతున్ని ప్రార్థిస్తున్నా. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని రైనా కూడా రిట్వీట్ చేశాడు.
2022 ఐపీఎల్ మెగా వేలానికి ముందు రైనా సీఎష్కే జట్టు నుంచి రిలీజ్ అయ్యాడు. అందరినీ ఆశ్చర్యపరిచేలా రైనాను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. ఎడమచేతి వాటం బ్యాటర్ కోసం సీఎస్కే కూడా వేలం వేయలేదు. ఐపీఎల్ ఎన్కౌంటర్ల సమయంలో తన అభిప్రాయాలు, ఆలోచనలను అందించడానికి రైనా ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్లో చేరాడు.