ఇంత కాలం ఎవరైనా దూరమయ్యారా?:
గవాస్కర్ తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొని పలు విషయాలపై చర్చించారు. 'ఒకవేళ టీ20 ప్రపంచకప్ జట్టులో ధోనీ ఉండాలనుకుంటే.. అతడి ఫిట్నెస్ గురించి ఎవరేం చెప్పలేరు. ఆ విషయాన్ని ధోనీ తనకు తాను ప్రశ్నించుకోవాలి. గతేడాది జూలై (వన్డే ప్రపంచకప్) నుంచి ధోనీ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కావాలని జాతీయ జట్టుకు ఇంత కాలం ఎవరైనా దూరమయ్యారా? ఇప్పుడిదే ప్రశ్న అందరి మదిలో ఉంది' అని గవాస్కర్ అన్నారు.
రంజీ ఫీజు పెంచాల్సిందే:
'రంజీ ట్రోఫీపై ఐపీఎల్ ఆధిపత్యం చెలాయిస్తోంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న దేశవాళీ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు ప్రస్తుతం ఒక్కో మ్యాచ్కు రూ. 2.5 లక్షలు ఫీజు ఉంది. ఐపీఎల్ మ్యాచ్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. వీలైనంత త్వరగా దేశవాళీ మ్యాచ్ ఫీజు పెంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఐపీఎల్కు రంజీ ట్రోఫీ పేద బంధువులా మిగిలిపోతుంది' అని సన్నీ అభిప్రాయపడ్డారు.
దేశం సంక్షోభంలో ఉంది:
పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై గావస్కర్ స్పందించారు. 'ప్రస్తుతం మన దేశం సంక్షోభంలో ఉంది. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లపై కనిపిస్తున్నారు. మరికొందరు ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది. అయితే ఎక్కువ మంది చదువుపైనే దృష్టి పెట్టారు. మనం అందరం భారతీయులిగా కలిసి ఉన్నప్పుడే దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలం. ఆట మాకు ఇదే నేర్పించింది' అని టీజెలిపారు.
బలమైన దేశంగా తయారవుతాం:
'గతంలో ఇలాంటి సంక్షోభమే వస్తే దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా ఈ దశను అధిగమించి బలమైన దేశంగా తయారవుతాం' అని గావస్కర్ చెప్పుకొచ్చారు. సీఏఏకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విద్యాసంస్థల్లో విద్యార్థులు సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.