కాండీ: ఆతిథ్య శ్రీలంక ఎట్టకేలకు పోటీలోకొచ్చింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో శ్రీలంక 3 పరుగుల తేడాతో(డక్వర్త్ లూయిస్ పద్ధతి) ఉత్కంఠ విజయం సాధించింది. హ్యాట్రిక్ ఓటముల అనంతరం శ్రీలంక.. దక్షిణాఫ్రికాతో బుధవారం కాండీలో జరిగిన డే నైట్ నాలుగో వన్డేలో 3 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్లో సఫారీల ఆధిక్యాన్ని 3-1కి తగ్గించింది.
వర్షం అంతరాయం మధ్య లంక నిర్దేశించిన లక్ష్యఛేదన(21 ఓవర్లలో 191)కు దిగిన సఫారీలు 21 ఓవర్లలో 187/9 స్కోరుకు పరిమితమైంది. చివరి ఓవర్లో సఫారీలు గెలవాలంటే 8 పరుగులు అవసరం కాగా, లక్మల్ (3/ 46)... మిల్లర్ను ఔట్ చేయడంతో పాటు నాలుగే పరుగులు ఇచ్చి లంకను గెలిపించాడు. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(40), డుమిని(38) రాణించగా, ఆఖర్లో డేవిడ్ మిల్లర్(21) టెయిలెండర్లతో కలిసి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు.
మూడో వికెట్కు ఆమ్లా, డుమిని కలిసి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్మల్(3/46), తిసార పెరెర(2/32) రాణించగా, ధనంజయ, పెరెర, షనక, డిసిల్వా ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లంక ఓపెనర్లు డికెవెలా (34), తరంగ (36) శుభారంభం అందించగా... కుశాల్ పెరీరా(51), తిసార పెరీరా (51 నాటౌట్), షనక(65) అర్ధసెంచరీలతో లంక 39 ఓవర్లలో 306/7 స్కోరు చేసింది.
ఏడో వికెట్కు తిసార పెరెర, షనక 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది. ఎంగిడి(2/65), డుమిని(2/35) రెండేసి వికెట్లు తీయగా, ఫెల్కువాయో, మల్దర్, మహరాజ్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. లంక ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఉండగా వర్షం కారణంగా అరగంటపైగా ఆట నిలిచిపోవడంతో మ్యాచ్ను 39 ఓవర్లకు కుదించారు. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే ఈనెల 12న జరుగుతుంది.