
సౌతాఫ్రికా క్రికెటర్ జుబేర్ హంజాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించింది. దీంతో ఇక నుంచి అతను ఎటువంటి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేడు. డోపింగ్ టెస్టులో పాజిటివ్గా తేలినందుకుగానూ జుబేర్ హంజాపై ఐసీసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది. జుబేర్ హంజా కూడా ఈ నిషేధాన్ని అంగీకరించాడు. అసలు ఏం జరిగిందంటే ఈ ఏడాది జనవరిలో పలువురు సౌతాఫ్రికా క్రికెటర్లకు ఐసీసీ డోపింగ్ టెస్టులు నిర్వహించింది.
అందులో జుబేర్ హంజాకు పాజిటివ్గా నిర్దారణ అయింది. అంతేకాకుండా డోపింగ్ టెస్టు విచారణలో ఐసీసీకి సహకరించిన జుబేర్ హంజా డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించాడు. అయితే జుబేర్ హంజాకు మళ్లీ భవిష్యత్లో క్రికెట్ ఆడే అవాకశాలు ఉంటాయని క్రికెట సౌతాఫ్రికా తెలిపింది. ఇందుకు సీఎస్ఏ, సాకా, డబ్ల్యూపీసీఏ జుబేర్ హంజాకు మద్దతుగా ఉంటాయని పేర్కొంది.
కాగా 26 ఏళ్ల జుబేర్ హంజా 2019లో పాకిస్థాన్తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 6 టెస్టు మ్యాచ్లాడిన జుబేర్ హంజా 17 సగటుతో 212 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. అత్యధిక స్కోర్ 62 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో 29 ఫోర్లు, ఒక సిక్సు బాదాడు. ఇక ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడిన జుబేర్ హంజా 56 పరుగులతో రాణించాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి.