క్రికెట్కు మేలు చేసేందుకే ఉన్నాం
బీసీసీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదా మీడియాతో మాట్లాడారు. 'బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నా. భారత క్రికెట్కు మేలు చేసేందుకే ఇక్కడ ఉన్నాం. క్రికెట్ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ముంబై నగరం టీమిండియాకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లను అందించింది' అని అన్నారు.
రిటైర్మెంట్పై ఇంకా మాట్లాడలేదు:
'భారత క్రికెట్ చరిత్రలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీది ప్రత్యేక స్థానం. దేశం గర్వించే విధంగా ఎన్నో విజయాలు అందించాడు. ఎవరికీ సాధ్యం కాని రెండు ప్రపంచకప్లను టీమిండియాకు అందించాడు. గొప్ప కెప్టెన్. రిటైర్మెంట్పై ఇంకా తనతో మాట్లాడలేదు. ముందుగా సెలెక్టర్లతో సమావేశం అయి.. ఆ తర్వాత ధోనీతో మాట్లాడుతా' అని దాదా తెలిపారు.
భారత జట్టు అద్భుతంగా ఉంది
'ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అపూర్వ విజయాలను సాధించింది. ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యంత ప్రధానమైన వ్యక్తి కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతనికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం. టీమిండియాకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తాం' అని దాదా స్పష్టం చేశారు.
కోహ్లీకి అండగా ఉంటాం
'ప్రపంచంలోనే టీమిండియాను మేటి జట్టుగా చేయలనేది కోహ్లీ తాపత్రయం. అతడికి అన్ని విధాలా అండగా ఉంటాం. కోహ్లీతో రేపు సమావేశమవుతా. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల సంక్షేమానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. ఐసీసీ నుంచి భారత్కు రావాల్సిన బకాయిలను రాబడతాం' అని దాదా చెప్పుకొచ్చారు.