|
అంబటి కేరీర్ అర్ధాంతరంగా ముగియడం వెనుక..
ఉజ్వల భవిష్యత్తు ఉన్న అంబటి రాయుడి కేరీర్ అర్ధాంతరంగా ముగియడం వెనుక భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీ) చీఫ్ సెలెక్టర్, తెలుగు వాడైన మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ అలియాస్ ఎమ్మెస్కే ప్రసాద్ హస్తం ఉందని నెటిజన్లు, ట్విట్టరెట్టీలు ఆరోపిస్తున్నారు. ఆయన వల్లే అంబటి రాయుడు కేరీర్ ముగిసిందని ఆరోపిస్తున్నారు నెటిజన్లు. ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. వందల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. అవన్నీ ఎమ్మెస్కే ప్రసాద్ను వేలేత్తి చూపుతున్నవే కావడం గమనార్హం. రాష్ట్రంలో సహజంగానే రెండు ప్రధాన కులాలైన కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు, మనస్పర్థలు అంబటి రాయుడి కేరీర్ను తొక్కేశాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
|
ఎమ్మెస్కే, అంంటి రాయుడు.. ఇద్దరిదీ ఒకే జిల్లా!
క్రికెట్ అంటే ఓ మతంలా భావిస్తారు భారతీయులు. దీన్ని మించిన ఆట ఈ భూగోళం మీదే ఎక్కడా లేదు, ఉండదు అనే గట్టి అభిప్రాయం ఉంది మెజారిటీ భారతీయులకు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే రంగం అది. అలాంటి చోట కులం ప్రస్తావన రావడం అనేది విషాదకరం, విచారకరం కూడా. అయినప్పటికీ- నెటిజన్లు గానీ, ట్విట్టరెట్టీలు గానీ పదే, పదే ఇదే అంశాన్ని తమ ట్వీట్లలో పొందుపరుస్తున్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆటగాడు. ఇక అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన క్రికెటర్. అటు ఎమ్మెస్కే ప్రసాద్, ఇటు అంబటి రాయుడు ఇద్దరిదీ ఒకే జిల్లా- అదే గుంటూరు. అంబటి రాయుడు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన యువకుడు కాగా.. ఎమ్మెస్కే ప్రసాద్ స్వస్థలం మేడికొండూరు.
|
అజరుద్దీన్ కేప్టెన్గా ఉండగా..
క్రికెట్లో భాషాభిమానానికి, ప్రాంతీయ అభిమానానికి తావు ఉండదు. ఆటగాళ్ల ప్రతిభను మాత్రమే కొలమానంగా తీసుకుని క్రికెటర్లను ఎంపిక చేస్తారు. ఇందులో ఇక సందేహాలు అనవసరం. హైదరాబాదీయుడు, తెలుగువాడైన మహమ్మద్ అజరుద్దీన్ భారత క్రికెట్ జట్టు కేప్టెన్గా ఉన్న సమయంలో తోటి తెలుగు క్రికెటర్ వెంకటపతి రాజుకు అవకాశం కల్పించగా.. అప్పట్లో దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అజరుద్దీన్ ప్రాంతీయ అభిమానాన్ని చూపుతున్నారని అంటూ అప్పట్లో విమర్శలు చెలరేగాయి. అయినప్పటికీ.. - తన ప్రతిభతో అందరి నోళ్లనూ మూయించగలిగాడు వెంకటపతి రాజు. తాను ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లోనే ఎనిమిది వికెట్లను పడగొట్టి తానేమిటో నిరూపించుకున్నాడు వెంకటపతి రాజు.
|
అంబటి రాయుడికేదీ ఛాన్స్
అలాంటి అవకాశం అంబటి రాయుడికి దక్కిన సందర్భాలు చాలా తక్కువే. ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్గా నియమితులైన తరువాత అంబటి రాయుడు జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భాలు కూడా చాలా తక్కువనే అంటున్నారు నెటిజన్లు. కులం ప్రాతిపదికన అంబటి రాయుడిని పక్కన పెట్టారనే ఆరోపణలు అప్పటి నుంచీ వినిపిస్తూనే వస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్ కోస ఎంపిక చేసిన టీమిండియాలో అంబటి రాయుడికి అవకాశం కల్పించకపోవడంతో ఆ ఆరోపణలు కాస్తా ఆకాశాన్ని అంటాయి. తాజాగా- విజయ్ శంకర్ గాయపడ్డ తరువాత కూడా అంబటి రాయుడిని పేరును కనీసం పరిశీలించకుండా, ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేయడం వెనుక ఎమ్మెస్కే హస్తం ఉందని నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు.
|
విజయ్ శంకర్ విఫలమైనా..b
విజయ్ శంకర్ విఫలమైనప్పటికీ.. వరుసగా అతనికి అవకాశాలు పలకరించాయి. పాకిస్తాన్తో మ్యాచ్లో విజయ్ శంకర్ 15 పరుగులుతో నాటౌట్గా నిలిచాడు. దాని తరువాతి మ్యాచ్లల్లో రాణించలేకపోయాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో 14, వెస్టిండీస్తో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మడమల్లో గాయం వల్ల ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్లపై బౌలింగ్ వేయలేకపోయాడు. తాజాగా అతను టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ను జట్టులోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఇక్కడో విచిత్రం ఏమిటంటే- ఇప్పటిదాకా మయాంక్ అగర్వాల్ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. జాతీయ జట్టు తరఫున రెండు టెస్ట్ మ్యాచులు ఆడాడంతే. ఇక టీ20ల్లో ఆడిన అనుభవం మయాంక్ అగర్వాల్కు ఉంది.