హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఇంగ్లాండ్లోని కియా సూపర్ లీగ్లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్గా రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్ ఆడిన ఆమె ఇకపై ఇంగ్లండ్లో జరిగే కియా సూపర్ టి20 లీగ్లోనూ బరిలో దిగనుంది.
ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్లో జులై 22 నుంచి ఆరంభం కానుంది. దీంతో ఈ లీగ్లో స్మృతి వెస్టర్న్ స్టార్మ్ తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై స్మృతి మందాన స్పందిస్తూ ''కియా లీగ్లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్గా నిలిచినందుకు గర్వంగా ఉంది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తా'' అని చెప్పింది.
మరోవైపు ''స్మృతి మా జట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం మహిళా క్రికెట్లోని అద్భుతమైన యువ క్రికెటర్లలో ఆమె ఒకరు. వయసు తక్కువే అయినా కూడా ఆమెకు అత్యున్నత స్థాయిలో ఆడిన అనుభవం ఉంది. ఆమె తన సత్తామేరకు రాణిస్తుందనే నమ్మకం ఉంది'' అని వెస్టర్న్ స్టార్మ్ కోచ్ ట్రేవర్ గ్రిఫిన్ తెలిపాడు.