
టీమిండియా స్టార్ పేసర్లు మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్తోపాటు మరికొందరు సిబ్బందిపై నెట్టింట తెగ ట్రోలింగ్ జరుగుతోంది. వీళ్లంతా కూడా నుదుటిపై తిలకం దిద్దించుకోవడానికి నిరాకరించడమే దీనికి కారణం. ఇటీవల జరిగిన ఏదో మ్యాచ్ కోసం భారత జట్టు ఒక హోటల్కు వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆటగాళ్లు, టీమిండియా సహాయక సిబ్బందికి ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. ఈ క్రమంలోనే ఆటగాళ్ల నుదుటిపై బొట్టు పెట్టి పిలిచారు.
టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ సహా ఆటగాళ్లందరూ ఈ బొట్టు పెట్టించుకున్నారు. అయితే ఉమ్రాన్ మాలిక్ మాత్రం బొట్టుకు దూరంగా జరుగుతూ కంగారుగా వద్దన్నాడు. మహమ్మద్ సిరాజ్, భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తమకు బొట్టు వద్దంటూ చేతులతో సైగ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భారత క్రికెటర్లపై ట్రోలింగ్ మొదలు పెట్టారు.
కేవలం మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ మాత్రమే కాదు.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్తోపాటు సహాయక బృందంలో మరోకరు కూడా ఇలా తిలకం పెట్టించుకోవడానికి నిరాకరించారు. ఇది గమనించిన నెటిజన్లు వీళ్లను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ఎప్పుడు తీసింది ఇంకా తెలియరాలేదు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం జట్టు నాగ్పూర్ చేరినప్పుడు ఈ ఘటన జరిగిందా? లేక అంతకుముందు జరిగిన పాత ఘటనా? అనేది ఇంకాా తేలాల్సి ఉంది.
ఇదిలా వుండగా.. టీమిండియా పేసర్ సిరాజ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెలలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా సిరాజ్ చాలా కీలకం కానున్నాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడిప్పుడే తన సత్తా నిరూపించుకుంటున్నాడు. సిరాజ్ ఇప్పటి వరకు 15 టెస్టుల్లో 46 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. ఈ నేపథ్యంలో సిరాజ్ ఆటతీరు భారత జట్టుకు చాలా కీలకం. మరి అతను ఎలా రాణిస్తాడో చూడాలి.