న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లేను తొలగించడానికి మరో కారణం బయటికి వచ్చింది. క్రికెట్ అభిమానులను తన మాట తీరుతో ఇట్టే ఆకట్టుకునే హర్షా భోగ్లే... ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ సీజన్లన్నింటిలో తన వ్యాఖ్యానంతో దుమ్ము రేపారు.
అయితే ఐపీఎల్ తాజా సీజన్కు గంటల ముందు బీసీసీఐ హర్షా భోగ్లేను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మాత్రం బీసీసీఐ పెద్దలు ఇప్పటిదాకా చెప్పనే లేదు. ఈ క్రమంలో హర్షా భోగ్లే కనిపించకపోవడంపై పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు కారణాలు తెర మీదకు రాగా, తాజాగా మరో ఆసక్తికర ఊహాగానం వెలుగుచూసింది.
ఈ ఉహాగానం ప్రకారం... ఐపీఎల్కు ముందు టీమిండియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న విమానంలోనే హర్షా భోగ్లే కూడా ప్రయాణించారు. ఈ సందర్భంగా జట్టు సీనియర్ క్రికెటర్ ఒకరు హర్షా భోగ్లేతో వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా విమానం ఆకాశంలో ఉండగానే భోగ్లే, సదరు క్రికెటర్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకానొక సందర్భంలో జట్టును దూషిస్తూ భోగ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మరో క్రికెటర్ వారిద్దరిని వారించి అప్పటికి వాగ్వాదానికి తెర దించారు.
అయితే విమానం దిగిన తర్వాత మాత్రం జట్టు సభ్యులు నేరుగా బీసీసీఐ పెద్దలకు భోగ్లేపై ఫిర్యాదు చేశారు. జట్టును, జట్టు సభ్యులను కించపరుస్తూ భోగ్లే అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వారు చేసిన ఫిర్యాదుతోనే బీసీసీఐ భోగ్లేపై వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆ సీనియర్ క్రికెటర్లు ధోనీ, రైనాలేనని సమాచారం. ఏది ఏమైనా హర్షా భోగ్లే అభిమానులు మాత్రం బిసిసిఐకి నిరసన వ్యక్తం చేస్తున్నారు. భోగ్లేను తిరిగి తీసుకోవాలని కోరుతున్నారు.