హైదరాబాద్: సుదీర్ఘమైన ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్లేమి టీమిండియాలో కంగారు పెంచుతోందని మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ అభిప్రాయపడ్డాడు. మూడు టీ20ల సిరిస్ను 2-1తేడాతో కైవసం చేసుకుని కోహ్లీసేన ఇంగ్లాండ్ గడ్డపై ఘనంగా ఆరంభించింది.
మూడు టీ20ల సిరిస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభంకానుంది. నాటింగ్హామ్ వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరిస్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సిరీస్ తీరుపై మోహిందర్ అమర్నాథ్ ఓ మీడియా సంస్థకి వ్యాసం రాశాడు.
"ఇంగ్లాండ్ పర్యటనని భారత జట్టు మెరుగ్గా ఆరంభించింది. మిగిలిన జట్లతో పోలిస్తే.. టీ20ల్లో తామే మెరుగైన జట్టు అని మరోసారి సిరీస్ విజయం ద్వారా నిరూపించుకుంది. ఇక గురువారం నుంచి జరగనున్న వన్డే సిరీస్లోనూ అదే జోరుని కొనసాగిస్తుందని నమ్ముతున్నా" అని అన్నాడు.
"టీ20 సిరీస్లో జట్టులోని కొద్దిమంది ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనని కనబర్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ.. మూడో టీ20లో బాదిన శతకం అమోఘం. ఏ గడ్డపైనైనా తాను ఆడగలనని అతను నిరూపించుకున్నాడు. హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ అంచనాలకి తగినట్లు రాణించారు" అని అమర్నాథ్ అన్నాడు.
"ఇంగ్లాండ్ పర్యటనలో ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ మాత్రం భారత జట్టులో కంగారు పెంచుతోంది. అయితే.. గురువారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో మళ్లీ అతడు లయ అందుకుంటాడని ఆశిస్తున్నా" అని అమర్నాథ్ వెల్లడించాడు.
ఇంగ్లాండ్తో ముగిసిన మూడు టీ20ల సిరిస్లో ఓపెనర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యాలు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.