'ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరిస్ నెగ్గడం 1983 వరల్డ్ కప్ విజయం కంటే గొప్పది'

హైదరాబాద్: కోహ్లీసేనపై తరచూ విమర్శలు చేస్తున్న వారికి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి గట్టి కౌంటర్ ఇచ్చాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ టెస్టు సిరీస్ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్ టెస్టు సిరిస్ను డ్రా చేసుకోగలిగింది కానీ, విజయం మాత్రం సాధించలేదు. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో టీమిండియా 7 టెస్టుల్లో విజయం సాధించింది.

72 ఏళ్ల నిరీక్షణకు తెర
దీంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది. మ్యాచ్ అనతంరం హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయం 1983 వరల్డ్కప్ విజయం కంటే గొప్పదని అన్నాడు. గత భారత జట్లతో పోల్చితే ఈ జట్టుకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని తాను గర్వంగా చెప్పగలనని అన్నాడు.

ఈ విజయం 1983 వరల్డ్ కప్ కంటే గొప్పది
"సిరీస్ విజయం నాకెంతో సంతృప్తినిచ్చింది. 1983 ప్రపంచ కప్, 1985 క్రికెట్ ప్రపంచ ఛాంపియన్షిప్ విజయాలతో ఇది సమానం. అంతకంటే ఎక్కువే. క్రికెట్లో టెస్టులే అసలైన ఆట. అత్యంత కఠినమైన ఫార్మాట్ ఐదు రోజుల ఆటే. అందుకే ఈ గెలుపు అన్నిటికంటే గొప్పది. గతం చరిత్ర. భవిష్యత్తు మిథ్య. 71 ఏళ్ల తర్వాత ఇక్కడ గెలిచాం. వర్తమానంలో ఉండటమే నాకిష్టం. కంగారూ గడ్డపై ఆసీస్ను ఓడించిన టీమ్ఇండియా తొలి కెప్టెన్ విరాట్ కోహ్లికి నా సెల్యూట్. టెస్టు క్రికెట్ను కోహ్లి కంటే కసిగా ఇంకెవరూ ఆడలేరు. మరే అంతర్జాతీయ కెప్టెన్ అతడి దరిదాపుల్లోకి కూడా రాలేడు. పరిస్థితులపై అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మెల్బోర్న్లో నేను చేసిన కామెంట్ జోక్ కాదు. జట్టు ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఎక్కడి నుంచో విమర్శలు విసిరితే అవి గాల్లోనే కలసిపోతాయి. ఈ సిరిస్ విజయం 1983 వరల్డ్ కప్ కంటే గొప్పది" అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

టీమిండియా ప్రస్తుత పర్యటనని ఓసారి పరిశీలిస్తే!
ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను టీమిండియా గెలవడంలో భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ పుజారా క్రియాశీలక పాత్ర పోషించాడు. సిరీస్లో జరిగిన నాలుగు టెస్టుల్లో ఏకంగా మూడు సెంచరీలు నమోదు చేసిన అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం ఏడు ఇన్నింగ్స్ల్లో కలిపి మొత్తం 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.

వికెట్ కీపర్ రిషబ్ పంత్
ఈ సిరిస్లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. పుజారాతో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 350 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 282 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ఇక, బౌలింగ్లోనూ భారత్ ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ పేసర్ల కంటే మెరుగ్గా రాణించారు. జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లతో కెరీర్లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేయగా ఆ తర్వాత మహ్మద్ షమీ 16, ఇషాంత్ శర్మ 11 వికెట్లు పడగొట్టారు.

2-1తేడాతో టెస్టు సిరిస్ కైవసం
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 146 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ తర్వాత మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి సిరిస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications