ఆ ఓటమి వెంటాడుతోంది..
'2016 ఫైనల్లో నేను ఆర్సీబీ తరుపున ఆడాను. నా కారణంగానే గెలిచే మ్యాచ్లో ఆర్సీబీ ఓడింది. ఇక ఈ ఓటమి నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఆర్సీబీకి ఆ టైటిల్ విజయం ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు.. హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్. ఆ ఏడాది ఆర్సీబీ అద్భుతంగా ఆడింది, సెకండాఫ్లో టాప్ టీమ్స్కి చుక్కలు చూపించింది. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు.ఆర్సీబీనే గెలుస్తుందని అంతా అనుకున్నారు. ఆర్సీబీలో గ్రేటెస్ట్ ప్లేయర్లు ఉండడంతో ఆ సీజన్లో విరాట్ కోహ్లీ, ఐపీఎల్ టైటిల్ గెలవాల్సింది. అయితే నేను వేసిన చివరి ఓవర్, వాటన్నింటినీ తుడిచి పెట్టేసింది.
నా కెరీర్ ముగిసిందనుకున్నా..
ఆ టైమ్లో ఆఖరి ఓవర్ వేసి ఉండాల్సింది కాదని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటా. ఇప్పటికీ ఆ మ్యాచ్ చూసినప్పుడల్లా పశ్చాతాపపడుతూనే ఉంటా. ఆ మ్యాచ్ సమయంలో నా కెరీర్ ముగిసిపోయిందనే అనుకున్నా.'అని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఇక నాటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్, 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో బెన్ కట్టింగ్ మూడు సిక్సర్లు, ఓ ఫోర్తో 24 పరుగులు రాబట్టాడు. అనంతరం విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ సూపర్ భాగస్వామ్యంతో 10 ఓవర్లు ముగిసే సమయానికే 112/0 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమై 8 పరుగుల తేడాతో ఓడింది. వాట్సన్ ఆఖరి ఓవర్లో 15 పరుగులు ఇచ్చినా ఫలితం వేరేగా ఉండేదని అతనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
వాట్సన్ తప్పిదంతో..
షేన్ వాట్సన్ కారణంగా టైటిల్ లేకుండానే విరాట్ తన కెప్టెన్సీ కెరీర్ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన షేన్ వాట్సన్, 2018 ఫైనల్లో సీఎస్కే టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కాలికి గాయమై రక్తం కారుతున్నా, అలాగే బ్యాటింగ్ చేసి సెంచరీ బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా సేవలందిస్తున్నాడు. ఢిల్లీ 13 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముంబైతో మే 21న జరిగే మ్యాచ్లో ఆ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతోంది.