
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. దీపావళి పండుగను పురస్కరించుకుని అన్నా-చెల్లెల్ల అనుబంధాన్ని చూపే "భాయ్ దూజ్" వేడుకకు సంబంధించి సంజయ్ మంజ్రేకర్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల విమర్శలకు గురైంది.
మంజ్రేకర్ తన ట్విట్టర్లో "నా కుమారుడు చెల్లిలితో స్పీకర్ ఫోన్లో మాట్లాడుతూ డాడీ ఎలా తప్పు చేశాడో చెప్పాడు" అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేల్చుతున్నారు. "నీ కుమారుడు నువ్వు తప్పు చేశావని చెప్పాడు కదా.. అదేంటో జడేజాను అడిగితే తెలుస్తుంది" అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.
"నువ్వు కామెంటెరీ బాక్స్లో కూర్చొని చేసిన వ్యాఖ్యలు నీ కుమారుడు విన్నాడేమో" అని మరొక నెటిజన్ ఛలోక్తి విసిరాడు. "జడేజాను తక్కువ చేసి మాట్లాడావు కదా.. అదే నీ కుమారుడు చెప్పాలనుకున్నాడేమో" అని మరొక నెటిజన్ సెటైర్ విసిరాడు. ఇలా సోషల్ మీడియాలో మంజ్రేకర్ను తమకు తోచినట్టు ఆడుకున్నారు.
కాగా, ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో భారత్-బంగ్లాదేశ్ జట్ల జరిగిన మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజాపై సంజయ్ మంజ్రేకర్ నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే. "నువ్వొక గల్లీ క్రికెటర్వి. నీ ఆటను నేను ఇష్టపడను. జడేజా లాంటి బిట్స్ అండ్ పీసెస్ ఆటగాళ్లకు నేను ఫ్యాన్ను కాను. జడేజా టెస్టు క్రికెటర్ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్కు అతడు అన్ఫిట్" అని అన్నాడు.