
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు పండుగ రోజైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బర్త్ డే ఏప్రిల్ 24 ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షల వెల్లువతో ముగిసింది. అభిమానులను ఉద్దేశించి సచిన్ కూడా ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. అయితే తనకెంతో ఇష్టమైన క్రికెట్ గ్రౌండ్లోనే సచిన్ టెండూల్కర్ కేక్ కట్ చేశారు. వాంఖడే మైదానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 45వ జన్మదిన వేడుకలను జరుపుకొన్నాడు.
ఐపీఎల్లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు సచిన్ కూడా మైదానానికి వచ్చాడు. మంగళవారం(ఏప్రిల్ 24) సచిన్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వాహకులు మైదానంలో సచిన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కామెంటేటర్ సైమన్ డల్... సచిన్ చేత కేక్ కట్ చేయించాడు. ఆ సమయంలో స్టేడియం సచిన్ నామస్మరణతో హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ..'ఈ రోజు ఎంతో ప్రత్యేకం. స్టేడియంలో ఏం జరుగుతుందో చూడండి. ఈ రోజు ఉదయం నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పలు ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో నా ఇంటి ముందు నిల్చున్నారు. మా అమ్మ ఆశీర్వాదం తీసుకోవడంతో ఈ రోజు నాకు మొదలైంది. ఆ తర్వాత నా కంపెనీ వెబ్సైట్ ఒకటి ప్రారంభించా. సాయంత్రం మేక్ ఎ విష్ ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ పేషెంట్స్తో కొంత సమయం గడిపా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చా' అని చెప్పాడు.
ముంబై ఇండియన్స్ సచిన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆట గెలిచి విజయాన్ని సచిన్ కు అంకితమిస్తారంటూ అందరూ భావించారు. కానీ, చాలా చిత్తుగా 87పరుగులకే ఆల్ అవుట్ అయింది. బౌలర్లు రాణించినంతగా బ్యాట్స్మెన్ ఆకట్టుకోలేకపోవడంతో.. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది.