కెప్టెన్గా రోహిత్ శర్మ
కోహ్లీ విశ్రాంతి నేపథ్యంలో సెలక్టర్లు రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంపిక చేయగా... వైస్ కెప్టెన్గా శిఖర్ ధావన్ను ఎంపిక చేశారు. దీంతో కెప్టెన్గా ఎంపికైన రోహిత్ శర్మపై బాధ్యత మరింత పెరిగిందని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా బ్రెట్ లీ మాట్లాడుతూ ఆసియా కప్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆట భారత్కి చాలా కీలకమని చెప్పుకొచ్చాడు.
వీరిద్దరూ బాధ్యతగా ఆడాలి
"రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అందరి దృష్టి రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్)పై ఉంటుంది. కాబట్టి వీరిద్దరూ బాధ్యతగా ఆడి జట్టుని ముందుండి నడిపించాలి. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను రోహిత్ శర్మ సమర్థంగా ఎదుర్కోలేడు అనే వాదనతో నేను ఏకీభవించను" అని బ్రెట్ లీ అన్నాడు.
రోహిత్ బలహీనతతోనే టార్గెట్ చేస్తాయి
"ప్రత్యర్థి జట్లు కచ్చితంగా అతడిని ఆ బలహీనతతోనే టార్గెట్ చేస్తాయి. కానీ, యూఏఈ పిచ్లు రోహిత్ శర్మ ఆటకి చక్కగా సరిపోతాయి. కాబట్టి అతను మెరుగైన ప్రదర్శన చేయొచ్చు" అని బ్రెట్ లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ఐదో టెస్టు
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరిస్ను 1-3తేడాతో కోహ్లీసేన చేజార్చుకున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.