
హైదరాబాద్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్కప్లో భారత యువ జట్టు ట్రోఫీని తిరిగి నిలబెట్టుకుంటుందనే నమ్మకాన్ని ఓపెనర్ రోహిత్ శర్మ వ్యక్తం చేశాడు. ఈ మెగా టోర్నీలో ఢిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత యువ జట్టు లీగ్ దశలో ఇప్పటికే రెండు విజయాలను సాధించి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తన ట్విట్టర్లో "దక్షిణాఫ్రికాలో ఉన్న అండర్-19 క్రికెట్ జట్టుకు అభినందనలు. ఇప్పటికే మంచి ఆరంభాన్ని అందుకున్నారు. టైటిల్ను కాపాడుకోవడమే కాదు, దానిని తిరిగి తీసుకురాగలరని ఆశిస్తున్నాము" అని ట్వీట్ చేశాడు. ఈ మెగా టోర్నీలో భారత యువ జట్టుకు ప్రియమ్ గార్గ్ సారథ్యం వహిస్తున్నాడు.
అతడి సారథ్యంలో భారత యువ జట్టు ఇప్పటికే రెండు విజయాలను సాధించింది. టోర్నీలో భాగంగా మంగళవారం గ్రూప్-ఎలో జపాన్తో జరిగిన మ్యాచ్లో భారత యువ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓవర్ల పరంగా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది రెండో వేగవంతమైన విజయం.
జపాన్ నిర్దేశించిన 42 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత యువ జట్టు వికెట్ నష్టపోకుండా 4.5 ఓవర్లలోనే చేధించింది. అంతకముందు శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో యువ భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం భారత జట్టు న్యూజిలాండ్తో తలపడనుంది.
2018లో జరిగిన అండర్-19 వరల్డ్కప్లో పృథ్వీ షా నేతృత్వంలోని టీమిండియా టైటిల్ను గెలుచుకుంది. పృథ్వీ షా ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో ఎంపికయ్యాడు. మొత్తంగా అండర్-19 వరల్డ్కప్ను టీమిండియా నాలుగు సార్లు కైవసం చేసుకుంది.