ఒప్పించిన గంగూలీ, షా:
శుక్రవారం రాత్రి దుబాయ్ వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా.. రాహుల్ ద్రవిడ్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం తెలుస్తోంది. ఇద్దరూ ద్రవిడ్ను టీమిండియా హెడ్ కోచ్గా ఉండేందుకు ఒప్పించారని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి ఓ జాతీయ మీడియాకు తెలిపారు. ద్రవిడ్ 2023 వరకు రెండేళ్ల పాటు అంగీకరించాడని చెప్పారు. 2023 ప్రపంచకప్ వరకు 'ది వాల్' టీమిండియా హెడ్ కోచ్గా ఉంటాడు.
బౌలింగ్ కోచ్గా పరాస్ మామ్బ్రే:
ఒమన్, యూఏఈలో అతి త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజీలాండ్ పర్యటనతో టీమిండియా కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా ద్రవిడ్ ఉన్నారు. ఆ బాధ్యతల నుంచి త్వరలోనే తప్పుకొంటాడని, అనంతరం భారత జట్టు పగ్గాలు అందుకుంటాడని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్గా పరాస్ మామ్బ్రే ఎంపిక లాంఛనం కానుంది. ఇక బ్యాటింగ్ కోచ్గా ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాఠోడ్ అదే పదవిలో కొనసాగనున్నాడు. అయితే ఫీల్డింగ్ కోచ్గా ఆర్ శ్రీధర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ద్రవిడ్ పర్యవేక్షణలోనే:
ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్-19 స్థాయిలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. కొందరు ప్లేయర్స్ ఇప్పుడు భారత జట్టులోనూ ఆడన్నారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది ద్రవిడ్నే తర్వాతి కోచ్గా నియమించాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ, జై షా అతడిని ఒప్పించారని సమాచారం. మరోవైపు ద్రవిడ్ ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ భారత జట్టు కోచ్గా సేవలందించిన సంగతి తెలిసిందే. గతంలో ఇండియా-ఏ జట్టుకు, శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు.
విదేశీ కోచ్ వచ్చే అవకాశమే లేదని:
భారత జట్టుకు విదేశీ కోచ్ వచ్చే అవకాశమే లేదని బీసీసీఐ ముందునుంచి చెపుతోంది. ఇప్పుడు అదే నిజమైంది. గతంలో నలుగురు విదేశీయులు భారత జట్టు కోచ్గా చేశారు. జాన్ రైట్, గ్రెగ్ చాపెల్, గ్యారీ కిర్స్టెన్, డంకన్ ఫ్లెచర్ కోచ్లుగా ఉన్నారు. ఇందులో కిర్స్టెన్ సక్సెస్ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి హయాంలోనే భారత్ 2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. ఇక 2016 నుంచి టీమిండియాకు స్వదేశీ కోచ్ ఉంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి రెండు పర్యాయాలు చేశాడు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ వంతు వచ్చింది.