

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీసేన ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం టీమిండియా, ఎసెక్స్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.
ఈ వార్మప్ మ్యాచ్కి ముందు టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు గాయమైంది. చేతికి స్వల్ప గాయం కావడంతో ముందు జాగ్రత్తగా అశ్విన్ ఎసెక్స్తో ప్రాక్టీస్ మ్యాచ్లో రెండో రోజు మైదానంలోకి దిగలేదు. దీంతో తొలి టెస్టులో అతను పాల్గొనడంపై కాస్త సందిగ్దం నెలకొంది.
గురువారం ఉదయం నెట్ సెషన్లో బౌలింగ్ చేస్తుండగా బంతి అతని కుడి చేతిని బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన ఈ ఆఫ్ స్పిన్నర్ వామప్ మ్యాచ్లో బ్యాటింగ్గానీ, బౌలింగ్గానీ చేయలేదు. గాయాన్ని పరిశీలించిన ఫిజియో చిన్నదేనని తేల్చడంతో లంచ్ విరామంలో నెట్స్లో బౌలింగ్ చేశాడు.
మరోవైపు ఎసెక్స్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో ఎసెక్స్ జట్టు కూడా దీటుగానే బదులిస్తోంది. దీంతో గురువారం ఆటముగిసే సమయానికి ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.
జేమ్స్ ఫాస్టర్ (23 బ్యాటింగ్), వాల్టర్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వెస్లీ, పెప్పర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. పేసర్లు ఉమేష్ యాదవ్ (2/23), ఇషాంత్ (2/38) చెరో రెండు వికెట్లు తీశారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 322/6తో రెండోరోజు ఆటను కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 395 పరుగులకు ఆలౌటైంది.
హార్ధిక్ పాండ్యా (51) హాఫ్ సెంచరీతో మెరవగా ఎసెక్స్ బౌలర్ వాల్టర్ (4/113) నాలుగు వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఎస్సెక్స్ 158 పరుగులు వెనుకబడింది. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్.. మరో 73 పరుగులు జత చేసి మిగిలిన నాలుగు వికెట్లను చేజార్చుకుంది.
రెండోరోజు తొలి బంతికే ఓవర్నైట్ బ్యాట్స్ మన్ దినేష్ కార్తీక్ (82) వాల్టర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. చివర్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ (26 బంతుల్లో 34 నాటౌట్) దూకుడగా ఆడటంతో టీమిండియా 395 పరుగులకు చేరింది. జడేజాతో కలిసి పదో వికెట్కు పంత్ 41 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.