పంజాబ్ కింగ్స్ షాకింగ్ నిర్ణయం.. కోచ్గా అనిల్ కుంబ్లే ఔట్, అతని స్థానంలో..!

ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేను ఆ పదవి నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. అతని పదవీకాలం ఫ్రాంచైజీతో ముగిశాక మళ్లీ కాంట్రాక్టు పునరుద్ధరించలేదు. దీంతో అతన్ని కోచ్ బాధ్యతల నుంచి తప్పించినట్లేనని స్పష్టమవుతుంది. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం.. బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పారిశ్రామికవేత్తలు మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సతీష్ మీనన్లతో కూడిన ఫ్రాంచైజీ బోర్డు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కుంబ్లే స్థానంలో మరో కొత్త కోచ్ కోసం చూస్తున్నారు. ఇక కొత్త కోచ్ ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

ఒక్కసారి కూడా ప్లేఆఫ్ చేరుకోలేదు
ఇకపోతే 2020 నుంచి అనిల్ కుంబ్లే పంజాబ్ ఫ్రాంచైజీకి కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అతను కోచ్గా సక్సెస్ కాలేకపోయాడు. 2020లో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పరిమితమైంది. 2021లో అయిదో స్థానంలో నిలిచింది. 2022ఎడిషన్లో ఆరో స్థానంలో నిలిచింది. ఒక్కసారి కూడా కుంబ్లే కోచ్గా ఉన్నప్పుడు టాప్ 4 (ప్లేఆఫ్)కు చేరుకోలేదు. దీంతో అందుకే అతన్ని తప్పించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేకపోయింది.

అయిదో కోచ్గా అనిల్ కుంబ్లే
ఇకపోతే అనిల్ కుంబ్లే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి అయిదో కోచ్గా పనిచేశాడు. అంతకుముందు సంజయ్ బంగర్ (2014-16), వీరేంద్ర సెహ్వాగ్ (2017), బ్రాడ్ హాడ్జ్ (2018), మైక్ హెస్సన్ (2019) ఆ జట్టు కోచ్లుగా వ్యవహరించారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్లకు మెంటార్గా పనిచేసిన కుంబ్లే 2016లో ఒక సంవత్సరం పాటు భారత ప్రధాన కోచ్గా వ్యవహరించాడు. ఇక 2020లో పంజాబ్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు. అతని హాయంలో పంజాబ్ 42 మ్యాచ్లు ఆడగా.. అందులో 18మాత్రమే గెలవగలిగాడు.. 22ఓడిపోయాడు. రెండు టై అయ్యాయి.

స్టార్లున్నా.. జట్టు స్థానం మారట్లేదు
2020 తర్వాత ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఇది రెండో చెత్త గణాంకాలు. సన్రైజర్స్ హైదరాబాద్ ఈ విషయంలో అత్యంత చెత్త టీంగా ఉంది. ఇక పంజాబ్ 2014లో ఫైనల్ చేరుకుంది. అలాగే రెండు సార్లు ప్లేఆఫ్ చేరుకుంది. అయినప్పటికీ ఆ జట్టు టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. తరచుగా జట్టులో కెప్టెన్సీ మార్పులు అలాగే కోచ్ విషయంలోనూ మార్పులు జరిగినా జట్టు ఫలితం మాత్రం మారలేదు. ఇకపోతే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆ జట్టు మంచి ఆటగాళ్లను కొనుగోళ్లు చేసినప్పటికీ ఆ జట్టు చతికిల పడడం గమనార్హం. ఇంగ్లాండ్ స్టార్లు లియామ్ లివింగ్స్టోన్, జానీ బెయిర్స్టో, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ, భారత ఓపెనర్ శిఖర్ ధావన్, వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఒడియన్ స్మిత్ లాంటి స్టార్లు ఆ జట్టు తరఫున ఉన్నారు.

కొత్త కోచ్గా అతనే..!
ఇకపోతే ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్, బౌలర్ అర్ష్దీప్ సింగ్లను వేలానికి ముందే రిటైన్ చేసుకుంది. అర్ష్దీప్ సింగ్ ఆ జట్టు అత్యుత్తమ బౌలర్గా ఎదిగి టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. అయితే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మాత్రం 2022 సీజన్లో పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 16.33 సగటుతో 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇకపతే జట్టు కెప్టెన్సీ మార్చబోతున్నట్లు ఇటీవల వార్తలు రాగా పంజాబ్ కింగ్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఖండించిన సంగతి తెలిసిందే. కోచ్ మార్పు మాత్రం కచ్చితమైంది. అందుతున్న నివేదికల ప్రకారం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ను కొత్త కోచ్గా తీసుకున్నారట.. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications