యుద్ధం చేయాలి: గంభీర్, పుల్వామా ఉగ్రదాడిపై క్రీడాకారుల స్పందన

హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. ఇప్పటి వరకు జరిగింది చాలని, వెంటనే వేర్పాటు వాదులు, పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిందేనంటూ ట్వీట్ చేశాడు. ఈ ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం నాటికి ఆ సంఖ్య 44కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్తో పాటు సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఈ దాడిపై స్పందించారు. జవాన్ల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గౌతమ్ గంభీర్
సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి అనంతరం ఎకనామిక్ టైమ్స్ కథనాన్ని గంభీర్ ట్వీట్ చేస్తూ "అవును, వేర్పాటువాదులతో మాట్లాడాలి. అవును, పాకిస్థాన్తో చర్చించాలి. కానీ ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడటం కాదు. యుద్ధ భూమిలోకి దిగి సమాధానం చెప్పే సమయం వచ్చింది. జరిగింది చాలు. శ్రీనగర్-జమ్మూ హైవేలో జరిగిన దాడిలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు" అని గంభీర్ ట్విటర్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు
వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ "జమ్మూకశ్మీర్లో మన సీఆర్పీఎఫ్పై జరిగిన ఉగ్రదాడిలో మన వీరులు అమరులవడం చాలా బాధించింది. ఈ బాధను వర్ణించడానకి మాటలు సరిపోవు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో "పుల్వామాలో ఉగ్రదాడి ఘటన విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
సురేశ్ రైనా
సురేష్ రైనా తన ట్విట్టర్లో "కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అమరవీరుల కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.
శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ తన ట్విట్టర్లో "ఈ ఉగ్రదాడి వార్త తీవ్రంగా కలచి వేసింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాను. ఈ దాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశాడు.
వీవీఎస్ లక్ష్మణ్
వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విట్టర్లో "పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం, వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇదో విచారకరమైన వార్త. ఈ దాడిలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశాడు.
మహ్మద్ కైఫ్
మహ్మద్ కైఫ్ తన ట్విట్టర్లో "జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం.. అనేక మంది జవాన్లు ప్రాణాలుకోల్పోవడం వినడానికి చాలా బాధగా ఉంది. ఈ దాడిచేసిన పిరికి పందలకు త్వరలోనే గుణపాఠం కలగాలని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications