కోహ్లీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా అవార్డులు
ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ భాగస్వామ్యంతో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ అవార్డులను అందజేస్తుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమం శనివారం జరగాల్సి ఉంది. అయితే పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని కోహ్లీ ట్విట్టర్లో వెల్లడించాడు.
|
ట్విట్టర్లో వెల్లడించిన కోహ్లీ
"ఆర్పీ-ఎస్జీ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. పుల్వామా ఉగ్రదాడిలో భారత్ వైపు తీవ్ర నష్టం జరిగిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం" అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ మేరకు క్రీడాకారులు, ప్రముఖులకు సమాచారం అందించినట్లు కోహ్లీ తెలిపాడు.
మొత్తం ఐదు విభాగాల్లో
మొత్తం ఐదు విభాగాల్లో కోహ్లీ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు అవార్డులను అందజేస్తున్నారు. అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, సర్దార్ సింగ్, మహేశ్భూపతి, పీటీ ఉషా, అంజలి భగవత్ అవార్డుల సెలక్షన్ ప్యానల్లో సభ్యులుగా ఉండగా.. సునీల్ చటర్జీ, నీరజ్ చోప్రా, రిషబ్ పంత్, వినేశ్ ఫొగాట్, మనికా బాత్రా తదితరులు నామినీల జాబితాలో ఉన్నారు.
జవాన్ల మృతిపై క్రీడాకారులు దిగ్భ్రాంతి
కాగా, జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిపై 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం నాటికి ఆ సంఖ్య 42కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్తో పాటు సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఈ దాడిపై స్పందించారు. జవాన్ల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.