హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో తమ ఆటగాళ్లు ఒత్తిడికి గురై చిత్తుగా ఓటమి పాలవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పాకిస్థాన్ జట్టు మాజీ హెడ్ కోచ్ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. దుబాయిలో భారత జట్టు ఒత్తిడిలోకి వెళుతుందని అనుకుంటే, పాక్ ఘోరంగా ఓడిపోవడం తనకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందని అన్నాడు.
భువీ స్వింగ్, కేదార్ జాదవ్ మ్యాజిక్: పాక్పై భారత్ విజయం వెనుక
మంగళవారం దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాక్పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్లలో భువనేశ్వర్ (3/15), కేదార్ జాదవ్ (3/23), బుమ్రా (2/23) విజృంభించడంతో 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (46) పరుగులతో రాణించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో భారత బౌలర్లు తమ అద్భుత ఆటతీరుతో భారత్కు విజయాన్ని అందించారు.
మ్యాచ్ అనంతరం వకార్ యూనిస్ మాట్లాడుతూ "భారత్ను ఒత్తిడిలోకి నెట్టే అవకాశాలను పాక్ కోల్పోయింది. గత కొంతకాలంగా యూఏఈ అనేది పాక్కు సొంత వేదికగా ఉంది. అదే సమయంలో దుబాయిలో విపరీతమైన వేడి వాతావరణం మధ్య భారత్ ఎక్కువగా మ్యాచ్లు కూడా ఆడలేదు. సుదీర్ఘమైన ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత్కు ఇక్కడకు వచ్చింది" అని అన్నాడు.
"పాక్తో మ్యాచ్కు ముందు రోజు హాంకాంగ్పై భారత్ అతికష్టమ్మీద గెలిచింది. ఇవన్నీ కూడా పాక్కు అనుకూలంగా మారతాయని అనుకున్నా. కానీ అలా జరగలేదు. తమ జట్టే చిత్తుగా ఓడిపోయింది. పోరాడకుండానే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక గోల్డెన్ ఛాన్స్ను పాక్ కోల్పోయింది" అని వకార్ యూనిస్ వెల్లడించాడు.
కేదర్ జాదవ్ బౌలింగ్లో ధోనీ చేసిన స్టంపౌట్ (వీడియో)
ఇక, తన వరకూ అయితే భారత్-పాక్ జట్ల మధ్య చివరిగా జరిగిన రసవత్తరమైన మ్యాచ్ ఏదైనా ఉందంటే, అది 2011లో మొహాలీ వేదికగా జరిగిన వరల్డ్కప్ సెమీ ఫైనల్ మ్యాచేనని వకార్ యూనిస్ అన్నాడు. ఆసియా కప్లో భారత్-పాక్ జట్లు ఇప్పటికే సూపర్ ఫోర్కు అర్హత సాధించాయి. దీంతో ఇరు జట్ల మధ్య మళ్లీ సెప్టెంబర్ 23న మరో మ్యాచ్ జరగనుంది.