కోల్కత్తా: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ జరుగుతుందా? లేదా అనేది ఇప్పుడు సగటు క్రికెట్ అభిమానిని వేదిస్తోన్న ప్రశ్న. వరల్డ్ టీ20లో భాగంగా మార్చి 19న కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగాల్సిన మ్యాచ్పై సస్పెన్స్ కొనసాగుతోంది.
పాకిస్థాన్ జట్టు భారత్కు వచ్చే విషయమై ఇరుదేశాల మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. పాక్ జట్టుకు భద్రత కల్పించాలని రాతపూర్వక హామీ ఇవ్వాలని పాక్ పట్టుబడుతుండగా, రాతపూర్వక హామీ ఇచ్చేది లేదని భారత్ శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకుకేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో భారత్లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ పాక్ జట్టుకు భద్రత కల్పించే విషయంలో హోంశాఖ కార్యదర్శి హామీ ఇచ్చారని అన్నారు. ఇదే విషయాన్ని తమ ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పారు.
మరోవైపు భారత్-పాక్ మ్యాచ్ విషయంలో పాక్ జట్టుకు భద్రత కల్పించే విషయంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. తమ దేశానికి ఎవరొచ్చినా భద్రత కల్పిస్తామని చెప్పారు. మరోవైపు పాక్ జట్టుక భద్రత కల్పించే విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ లభించింది.
ఈ మేరకు పాక్ జట్టుకు భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్లు లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలతో కూడిన రెండు లేఖలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్)అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఐసీసీకి అందజేశారు.
పాక్ జట్టుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, తమ ఆటగాళ్లు మైదానంలో ఆడుతున్నప్పుడు ఎలాంటి సమస్య ఎదుర్కోకూడదని, భారత సర్కార్ నుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు తమ జట్టు భారత్కు బయల్దేరమని అని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసార్ అలీ ఖాన్ చౌదరి పేర్కొన్నారు.
భారత్-పాక్ మ్యాచ్ జట్టును ధర్మశాల నుంచి కోల్కతాకు తరలిస్తామని బీసీసీఐ అడగ్గా ఆ జట్టుకు భద్రత కల్పించే విషయంలో సీఎం మమతాను సంప్రదించగా ఆమె సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వరల్డ్ టీ20 టోర్నీలో మార్చి 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ను భద్రత కారణాలతో కోల్కత్తాకు మార్చిన సంగతి తెలిసిందే.