ఇస్లామాబాద్: పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టులకు వీడ్కోలు పలకడం ఆశ్చర్యానికి గురిచేసింది. టెస్టు ఫార్మాట్లో పాక్ జట్టుకు ఆమిర్ అవసరం చాలా ఉంది అని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. మహ్మద్ ఆమిర్ శుక్రవారం టెస్టు ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. ఆమిర్ 17 ఏళ్ల వయసులోనే గాలేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్లు ఆడిన ఆమిర్.. 119 వికెట్లు సాధించాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
'ఆమిర్ టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. 28 ఏళ్ల వయసులోనే క్రికెట్లో గొప్ప ఫార్మాట్ అయిన టెస్ట్లకు గుడ్బై చెప్పడం సరైన నిర్ణయం కాదు. అతడు తొందర పడ్డాడు. పాకిస్తాన్ జట్టుకు ఆమిర్ అవసరం ఎంతో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు జట్టులో అతను ఉండటం ముఖ్యం' అని వసీం అక్రమ్ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు.
ఆమీర్ మాట్లాడుతూ... 'సుదీర్ఘ ఫార్మాట్లో పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్పై దృష్టి సారించడం కోసం టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా. పాకిస్థాన్ జట్టుకు ఆడాలన్నదే నా అంతిమ లక్ష్యం. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్తో సహా జట్టు రాబోయే సవాళ్లకు తోడ్పడటానికి ఉత్తమమైన శారీరక ఆకృతిలో ఉండటానికి నా వంతు ప్రయత్నం చేస్తా' అని తెలిపాడు.
పాక్ టెస్టు జట్టులో పేసర్గా చోటు దక్కించుకున్న మహ్మద్ ఆమీర్పై 2010లో స్ఫాట్ ఫిక్సింగ్లో ప్రమేయం ఉందని తేలడంతో ఐదేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆమీర్ కేసులో మినహాయింపు ఇవ్వడంతో పాటు తిరిగి జాతీయ జట్టులో చోటు కల్పించింది. ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని ఆమీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.