ప్రస్తుతం టీ20 క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అతను సూర్యకుమార్ యాదవ్ అని చెప్పాలి. తొలి బంతి నుంచే బౌండరీలు బాదుతూ ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించడంలో సూర్య తర్వాతనే ఇక ఎవరైనా. అందుకే ఐసీసీ కూడా అతనికే టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్ పొజిషన్ ఇచ్చి చేతులు కట్టుకు కూర్చుంది. మైదానం నలువైపులా షాట్లు బాదుతూ మైదానంలో వీడియో గేమ్ ఆడినట్లు షాట్లు ఆడటం సూర్య స్పెషాలిటీ.
న్యూజిల్యాండ్తో రెండో టీ20లో కూడా సూర్య అదే మాదిరి తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. అతని ఆటతీరుపై మాట్లాడిన ప్రముఖ కామెంటేటర్, మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా.. 'భారత్ తయారు చేసిన తొలి టీ20 స్పెషలిస్టు ఇతనేనా? ఎందుకంటే మిగతా ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడారు కదా. కానీ సూర్య అలా కాదు. గువాహతి, పెర్త్, సిడ్నీ ఏ మైదానం అయినా సరే.. అక్కడ మన జెండా ఉన్నతంగా ఎగిరేలా చేస్తున్నాడీ క్రికెటర్. అతనే సూర్యకుమార్ యాదవ్' అని చెప్పాడు.
సూర్యను ఎలా అడ్డుకోవాలని కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ చెప్పిన మాటలను చోప్రా మరోసారి గుర్తుచేశాడు. 'సూర్యకుమార్ను అడ్డుకోవడానికి ఒకటే మార్గం. అది అతన్ని స్ట్రైకింగ్లోకి రాకుండా అడ్డుకోవడమే' అని చెప్పాడు. సూర్య చాలా డిఫరెంట్ ప్లేయర్ అని చెప్పిన చోప్రా.. అతని ఆటతీరు అద్భుతంగా ఉంటుందని, ప్రత్యర్థులు కూడా అతన్ని ఆపలేమని చెప్తున్నారంటేనే అతని సత్తా అర్థం అవుతోందని అన్నాడు. సూర్య చాలా క్లిష్టమైన షాట్లు ఆడుతున్నాడని చెప్పిన చోప్రా.. ఐష్ సోధి, శాంట్నర్ బౌలింగ్లో కవర్స్ మీదుగా కొట్టిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడాడు. అలాగే మూడో స్థానంలో సూర్యకుమార్ బ్యాటింగ్కు రావడంతో మరిన్ని బంతులు ఆడే అవకాశం దక్కిందని వివరించాడు.