ఆ ఘనతంతా న్యూజిలాండ్ బౌలర్లదే
"ఆ ఘనతంతా న్యూజిలాండ్ బౌలర్లకే దక్కుతుంది. చాలా అద్భుతంగా వాళ్లు మమ్మల్ని కట్టడి చేశారు. ఇది మా జట్టుకు ఒక గుణపాఠం. ముఖ్యంగా స్వింగ్ అయ్యే పిచ్లపై బ్యాటింగ్ ఎలా చేయాలనేది మ్యాచ్ తర్వాత మా ఆటగాళ్లకు కచ్చితంగా బోధపడుతుంది. టీమ్లో కోహ్లీ, ధోనీ లేనందున ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించి ఉండాల్సింది" అని రోహిత్ చెప్పాడు.
ఒత్తిడికి గురై వికెట్లను సమర్పించుకున్నాం
"ఒత్తిడికి గురై వికెట్లను సమర్పించుకున్నాం. కొన్ని చెత్త షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాం. ఒత్తిడికి లోను కాకుండా కనీసం పోరాటాన్ని కనబరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఆడటం అనేది ఎప్పుడూ సవాల్తో కూడుకున్నదే. మమ్మల్ని మేం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిలి. ప్రతి ఒక్క ఆటగాడు ఎక్కడ తప్పు చేశాడనే విషయాన్ని విశ్లేషించుకోవాలి" అని రోహిత్ తెలిపాడు.
భారత్ ఖాతాలో చెత్త రికార్డు
గురువారం జరిగిన నాలుగో వన్డేలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో జట్టుని నడిపించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ(7) ఆరంభంలోనే పేలవంగా వికెట్ చేజార్చుకోగా, కివీస్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్హోమ్ (3/26) దెబ్బకు 30.5 ఓవర్లలోనే భారత్ 92 పరుగులకి ఆలౌటైంది. ఫలితంగా గత తొమ్మిదేళ్లలో తొలిసారి అత్యల్ప స్కోరు నమోదు చేసిన చెత్త రికార్డుని ఖాతాలో వేసుకుంది.
|
కెప్టెన్గా రోహిత్ శర్మకు రెండో ఓటమి
కాగా, తాజా ఓటమి కెప్టెన్గా రోహిత్ శర్మకు రెండోది కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాలోని ఆరుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమవగా.. ఇందులో ఇద్దరు బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఓడిపోయిన రెండు వన్డేల్లోనూ సరిగ్గా ఇలానే జరగడం విశేషం.