
హైదరాబాద్: తప్పిదాల నుంచి తప్పకుండా పాఠాలు నేర్చుకుంటామని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. ముక్కోణపు టీ20 సిరిస్లో భాగంగా మంగళవారం కొలంబో వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్ (90: 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) దూకుడుగా ఆడుటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కుశాల్ పెరీరా (66: 37 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) రాణించాడు.
దీంతో ఆతిథ్య శ్రీలంక మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ 'లంకకు క్రెడిట్ దక్కాల్సిందే. అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తప్పిదాల నుంచి తప్పకుండా పాఠాలు నేర్చుకుంటాం. 175 పరుగుల లక్ష్యం కాపాడుకోదగినదే.. చివరి వరకూ ఆ దిశగా భారత్ ప్రయత్నించి ఉండాల్సింది' అని అన్నాడు.
'మ్యాచ్లో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపించింది. కానీ.. పిచ్ బ్యాటింగ్కే ఎక్కువగా అనుకూలించడంతో బౌలర్లు తేలిపోయారు. జట్టులోకి కొత్తగా వచ్చిన యువ క్రికెటర్లకి ఈ అనుభవం కెరీర్లో ఎంతగానో ఉపయోగపడుతుంది' అని రోహిత్ శర్మ వివరించాడు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఠాకూర్ వరుసగా 4 4, 4, 6, 4Nb, 4, 0 రూపంలో 27 పరుగులివ్వడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఈ ఓవర్తో శ్రీలంక పవర్ ప్లే ముగిసే నాటికి 75 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే సిరిస్లో భాగంగా బంగ్లాదేశ్, భారత్ మధ్య గురువారం మ్యాచ్ జరగనుంది.